ఇప్పటివరకూ చూసినది ట్రైలర్ మాత్రమేనట. అసలైన సినిమా ఇపుడు జగన్ చూపిస్తాడు అంటున్నారు వైసీపీ నేతలు. టీడీపీ అధినాయకుడితో పాటు తమ్ముళ్ళు ట్రైలర్ కే గంగవెర్రులెత్తుతూంటే ఇక అసలు సినిమా చూడగలరా అని కూడా అంటున్నారు. ఇంతకీ అసలు సినిమా కధేంటి, కమామీషూ ఏంటి. పొలిటికల్ మసాలా ఏంటి అన్నది త్వరలోనే రాజకీయ వెండి తెరపైన చూపిస్తారట.
అమరావతి అంటూ యమ దర్జా ఒలకబోసిన తెలుగుదేశం పెద్దల బండారం అంతా ఇపుడు జగన్ చేతుల్లో ఉందిట.
అమరావతి అక్రమాలపైన వేసిన విచారణ కమిటీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదికను ప్రభుత్వం చేతికి ఇచ్చిందట. ఈ నివేదికను ముందుంచుకున్న
జగన్ దాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారుట. ఈ నివేదిక వివరాలు నాలుగైదు రోజుల్లో మీడియా ముఖంగా ప్రజల ముందున పెడతారట. ఆ నివేదికలో షాకింగ్ నిజాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు.
అమరావతి పేరు మీద ఖర్చు చేసిన వందల కోట్లు, అందులో అవినీతి, అదే విధంగా
అమరావతి నిర్మాణాలకు గజం ఎంతకు ఇచ్చారు లాంటివి బయటపెట్టబోతున్నారని అంటున్నారు.
అదే సమయంలో రాజధాని ఏరియాలో నిర్మాణాలకు చదరపు అడుగుకు పది వేల రూపాయల కేటాయించడం పెద్ద స్కామ్ అని నివేదికలో పేర్కొన్నారని భోగట్టా. దేశంలో ఎక్కడా ఆ స్థాయిలో డబ్బులు చెల్లించింది లేదని హైదరాబాద్ బెంగళూరులో కూడా స్థలం విలువతో కలుపుకున్నా.. నిర్మాణానికి చదరపు అడుగుకు ఐదు వేల రూపాయల మొత్తం ఖర్చు లేదని నివేదికలో పేర్కొన్నారట. ఇది నిజంగా షాకింగ్ పరిణామమే మరి. ఇది కేవలం తమ కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పించడానికి పెద్ద ఎత్తున అవినీతికి ద్వారాలు తెరిచారని ఆ నివేదికలో పేర్కొన్నారట.
అదే విధంగా
అమరావతి డిజైన్ల పేరిట వందల కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయడం మరో స్కాం అంటున్నారు. అలా ఖర్చు చేసిన వందల కోట్లతో శాశ్వత భవనాలే పెద్దవి కట్టవచ్చునని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారుట. మరి ఈ నివేదిక కనుక బయటకు వస్తే
అమరావతి కాదు అది అవినీతి పురి అని అనకతప్పదంటున్నారు. ఇంతకాలం చంద్రబాబు అండ్ కో
జగన్ మీద చేస్తున్న విమర్శలకు ఒక్క దెబ్బతో గుక్కతిప్పుకోలేని విధంగా సమాధానం ఇచ్చినట్లు అవుతుందని కూడా అంటున్నారు. మరి చూడాలి
జగన్ చేతిలో ఇపుడు బిగ్ బాంబ్ ఉంది. అది గురి చూసి పేల్చితే పసుపు శిబిరం సంగంతేంటో మరి.