తాజాగా రాష్ట్రంలో మీడియా వర్గాలు జగన్ ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తున్నాయి. రేపో మాపో జర్నలిస్టు సంఘాలు కూడా ఉద్యమాలకు రెడీ అవుతున్నాయి. జగన్ ప్రజాస్వామ్య వ్యతిరేకి అంటూ.. ఇప్పటికే గత ప్రభుత్వ అనుకూల మీడియా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. డిబేట్లు కూడా చేపట్టింది. మరి ఇంతగా మీడియా ఒక్కసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడడానికి కారణం ఏంటి? ఏం జరిగింది? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మేధావి వర్గాల్లో చర్చగా ఉంది. విషయంలోకి వెళ్తే.. చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని, వస్తారని ఆశించిన ఓ వర్గం మీడియాకు ఆయన సీఎంగా లేక పోవడం ఇబ్బందిగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వంపై మీడియా ద్వారా పలుచన చేసేందుకు అనేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అధికారులను ట్రాన్స్ఫర్ చేసినా.. ప్రభుత్వ సలహాదారులను నియమించు కున్నా.. పక్కరాష్ట్రం కేసీఆర్తో దోస్తీ చేస్తున్నా.. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులను నియమించినా.. ఏదో జరుగుతోందనే ఉద్దేశాన్ని ఆపాదిస్తూ.. కథనాలు వండివార్చుతున్నాయి. మరో కీలక విషయం ఏంటంటే.. అమరావతి రాజధాని విషయంలోనూ జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఓ వర్గం మీడియా ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ రాజధాని కట్టే ఉద్దేశం జగన్ లేదని, రైతులను నిలువునా ముంచేందుకు ప్రయత్నిస్తోందని, చంద్రబాబుపై కోపంతో ఇప్పుడు జగన్ కసి తీర్చుకుంటున్నారని కథనాలను ప్రచారం చేసింది.
ఇక, అదేసమయంలో మంత్రులపై కూడా బాబు అనుకూల మీడియా నిఘా పెట్టింది. ఈ విషయాల పర్యవసానం అంతా కూడా జగన్ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడమే. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఆధారాలు లేకుండా, కల్పితాలతో కథనాలు రాసే.. పత్రికలు, చానళ్లపై చర్యలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి జీవో కూడా విడుదల కాలేదు. అయితే, ఇప్పటికే బాబు అండ్ కో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవడం నవ్విపోదురుగాక.. అన్నట్టుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. జగన్ పత్రిక, మీడియయాకు చెందిన రిపోర్టర్లపై కేసులు పెట్టి.. పోలీస్ స్టేషన్లకు అర్ధరాత్రి పూట తీసుకువచ్చినప్పుడు ఈ మీడియా స్వేచ్ఛ విషయం మరిచిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో డీజీపీగా ఉన్న రాముడు.. కూడా ప్రభుత్వం ఏం చెబితే.. అదే మాట్లాడుతూ.. రెచ్చిపోయి.. ``పెన్నుంది కదా అని రాసేస్తావా?`` అంటూ మీడియాపై విరుచుకుపడిన సంగతిని ఎవరూ మరిచిపోలేదని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా.. మీడియా సంయమనం పాటించనంత వరకు.. అటు బాబు పాలనే కావచ్చు.. ఇప్పుడు జగన్ పాలనా కావొచ్చు.. ఇబ్బందు కొనితెచ్చుకోవడమే అవుతుంది.