కొవిడ్-19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి, పేద దేశాల వరకు ఇప్పుడు కరోనా వైరస్ ప్రజలను కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. అయితే ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఐఐటీ పరిశోధకులు ఓ వినూత్న సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. దీనితో తక్కువ ఖర్చులోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. ఇక తాజాగా ఈ విధానానికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది.
దీని ద్వారా దేశంలో ఎక్కువ మందికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీలు ఉంటుందని భారత వైద్య పరిశోధన మండలి స్పష్టం చేసింది. ఇక ఐసీఎంఆర్ నుంచి అనుమతులు పొందిన తొలి విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ కావడం విశేషం. మరోవైపు ఈ కిట్ వంద శాతం కరోనాను ఖచ్చితంగా గుర్తిస్తుందని ఐసీఎంఆర్ ధృవీకరించింది. పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) ఆధారంగా ఈ పరికరం పని చేస్తుందని తెలుస్తోంది. కాగా, చైనా తయారీ కిట్ల ద్వారా కరోనా పరీక్షల నిర్వహణను ఐసీఎంఆర్ నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఢిల్లీ ఐఐటీ నిధులతో రూపొందించిన ఈ కిట్పై పేటెంట్ పరిశోధక బృందం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.