రాజ‌కీయాల్లో ఒక్కొక్క‌సారి అభ్య‌ర్థుల బ‌లం క‌న్నా.. ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌హీన‌త‌,.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు వంటివి ఎక్కువ‌గా ప్ర‌భావం చూపుతుంటాయి. ఇవి ఒక్కొక్క‌సారి విజ‌యం కూడా అందించేస్తాయి. ఇప్పు డు అచ్చంగా అలాంటి ప‌రిస్థితే.. అనంత‌పురం అర్బ‌న్‌లో క‌నిపిస్తోంది. ఇది.. ఒక‌ప్పుడు టీడీపీలో అంద‌రూ క‌లిసి మెలిసి ఉన్న ప‌రిస్థితి జేసీ బ్ర‌ద‌ర్స్‌ను పార్టీలోకి తీసుకున్న త‌ర్వాత‌.. టీడీపీలో అనైత్య‌కు  బీజం వేసింది. అంతిమంగా అటు వారికి.. ఇటు టీడీపీకి కూడా మేలు లేక‌పోగా.. కీడునే చేసింది.


2014లో అతిక‌ష్టం మీద గెలిచిన టీడీపీ.. 2019కి వ‌చ్చేసరికి.. చేతులు ఎత్తేసింది. ముఖ్యంగా సొంత‌నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. ఇక్క‌డ టీడీపీకి ఇబ్బందిగా మారాయి. 2014లో వైకుంఠం ప్ర‌భాక‌ర చౌద‌రి 9 వేల ఓట్ల  మెజారిటీతో విజ‌యం అందుకున్నారు. కానీ, జేసీ బ్ర‌దర్స్ ఆయ‌న‌కు కంట్లో న‌లుసుగా మారార‌నేది అందరికీ తెలిసిన విష‌య‌మే. ఐదేళ్లు అలానే గ‌డిచిపోయాయి. ఫ‌లితంగా 2019లో వైకుంఠం ప్ర‌భాక‌ర్ చౌద‌రి ఓడిపోయారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. వైసీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు.


ఈయ‌న‌కు బ‌ల‌మైన ఫాలోయింగ్ ఉండ‌డంతోపాటు.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ మంచి టాక్ వినిపిస్తోంది. పైగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో వివ‌రిస్తున్నారు. అదేవిధంగా యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌డంలోనూ వెంక‌ట్రామి రెడ్డి వినూత్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికి తోడు వైసీపీలో అసంతృప్తి లేక‌పోవ‌డం.. నాయ‌కులు క‌లివిడిగా ముందుకు సాగ‌డం క‌లిసి వ‌స్తున్న ప‌రిణామం. ఇక‌, టీడీపీ విష‌యాన్ని తీసుకుంటే.. ఆది నుంచి గంద‌ర‌గోళం ఏర్ప‌డింది.


పొత్తులో భాగంగా ఈ టికెట్‌ను జ‌న‌సేన‌కు ఇస్తామ‌ని..కొద్దిసేపు.. త‌ర్వాత బీజేపీకి ఇస్తామ‌ని కొంత సేపు ప్ర‌కటించారు. దీంతో చాలా రోజుల పాటు క్లారిటీ లేకుండా పోయింది. తీరా చివ‌రి నాటికి.. టీడీపీనే ఈ టికెట్ తీసుకుంది. కానీ, వైకుంఠం ప్ర‌భాక‌ర్ చౌద‌రికి కాకుండా.. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర ప్ర‌సాద్‌కు అవ‌కాశం ఇచ్చింది. ఇది పార్టీలో తీవ్ర అసంతృప్తుల‌కు.. ర‌గ‌డ‌కు దారితీసి.. ఏకంగా పార్టీ కార్యాల‌యం విధ్వంసం వ‌ర‌కు దారి తీసింది.


అయితే.. ఇటీవ‌ల వైకుంఠం ప్ర‌భాక‌ర్ చౌద‌రిని పార్టీ అధినేత బుజ్జ‌గించారు. పార్టీలో ప‌ద‌విని కూడా ఇచ్చారు. దీంతో స‌ర్దుకు పోయేందుకు సిద్ధ‌మ‌ని చౌద‌రి ప్ర‌క‌టించారు. కానీ, ఆయ‌న వ‌ర్గం మాత్రం క‌లిసి రావ‌డం లేదు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ సెగ‌లు పొగ‌లు అలానే ఉన్నాయి. మ‌రో ప‌ది రోజుల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఇప్ప‌టికైనా క‌లుస్తారా?  లేదా? అనేది చూడాలి. క‌లిస్తే.. గెలుపు ప‌క్కా అనే టాక్ వినిపిస్తుండడం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: