ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తోంది. కరోనా వైరస్ ధాటికి దేశాలన్నీ కకావికలం అవుతున్నాయి. భారత్లోనూ వైరస్ మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. అయితే మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే... కొవిడ్ -19 మరణాలు రేటు భారత్ లోనే అతి తక్కువని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా దేశంలో కొవిడ్ మరణాల రేటు 3.2 శాతం ఉందని... ఆ సంఖ్య ప్రపంచంలోనే అతి తక్కువగా కావడం ఊరటనిచ్చే అంశం అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
ఇప్పటికే ఈ వైరస్ భారిన పడిన వారిలో 10,633 మంది కోలుకున్నారని ఆయన తెలిపారు. ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి శాతం భారత్లో 26.59 గా ఉండటం ఊరట కలిగిస్తోంది. అయితే పది రోజుల కొంద కేసుల రెట్టింపు 10.5 రోజులు ఉండగా.. ప్రస్తుతం 12 రోజులకు చేరిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు 10 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో దాదాపు 30 వేల మందికి రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆదివారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 39,980కి చేరింది.