ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అగ్రరాజ్యాలు సైతం కరోనా దెబ్బకు బెంబేలెత్తిపోతున్నాయి. ఇక ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో.. ప్రపంచదేశాలకు మరింత పెద్ద సవాల్గా మారింది. ఇక ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 47 లక్షల పాజిటివ్ కేసులు మించిపోగా.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 31 లక్షలు దాటేసింది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కళ్లు మూసుకుపోయిన కామాంధులు.. ఆడది కనిపిస్తే చాలు కామంతో రెచ్చిపోతున్నారు.
తాజాగా.. పంజాబ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దేవాలయ ఆవరణలోనే.. ఇద్దరు మహిళల్ని అక్రమంగా నిర్భంధించడమే కాకుండా.. వారిపై పదేపదే అత్యాచారం చేశాడు ఓ పూజారి. అమృత్సర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ తీర్థ్ కాంప్లెక్స్లో ఉన్న గురు జ్ఞాన్నాథ్ ఆశ్రమ వాల్మీకి తీర్థ్కు చెందిన ప్రధాన పూజారి.. తమను నిర్బంధించారని ఇద్దరు మహిళలు ఆరోపించారు. అంతేకాదు.. ఆ పూజారి తమపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ.. పంజాబ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు లేఖలో ఫిర్యాదు చేశారు.
అయితే ఈ విషయాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్.. డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన పూజారితో పాటుగా.. మరొకరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి రావడాన్ని చూసి పూజారి అనుచరులిద్దరు పారిపోయారని.. అయితే పూజారితో పాటు మరొకర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నామని పోలీస్ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ లాక్డౌన్ కాలంలోనూ ఆడవారిపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకు ఎక్కడోకక్కడ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.