ఉగాది పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరంగా జరుపుకుంటున్నారు. ఇవాళ్టి నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఇదే సమయంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు హీట్ తారాస్థాయికి చేరింది. రాజకీయ నాయకులు క్రోధి నామ సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉండబోతుందో ముందస్తుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు.


ఉగాది సందర్భంగా ఆయా రాజకీయ అధి నేతలు తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని పండితుల ద్వారా చెప్పించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇది ఎన్నికల నామ సంవత్సరం కావడంతో వారి చూపంతా అధికారంపైనే ఉంటుంది. దీంతో వారు పదవి చేపడతారా లేదా అనేది పండితులు లెక్కలు కట్టి చెబుతుంటారు. ఇది నిజం అవుతుందో లేదో తెలియదు కానీ.. మన నాయకులు మాత్రం దీనిని ప్రతి ఉగాదికి తూచా తప్పకుండా పాటిస్తుంటారు.


క్రోధి నామ సంవత్సరంలో జగన్ జాతకం ఎలా ఉండబోతుందో స్పష్టత ఇచ్చారు. కానీ ఆయన జాతకం చెప్పింది పంచాంగ పండితులు కాదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.  2019లో ఆయన వ్యూహాలతోనే వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ఓడిపోతారని పలుమార్లు కుండబద్ధలు కొట్టిన ఆయన తాజాగా మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.


ప్రజలకు నగదు బదిలీ చేశారు తప్పితే.. ఉద్యోగాల కల్పన, రాష్ట్రాభివృద్ధిపై ఆయన శ్రద్ధ పెట్టేలేదని వివరించారు. దీంతో జగన్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు కొట్టి పారేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు స్ర్కిప్టుగా అభివర్ణిస్తున్నారు. కాకపోతే పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఆయన గురించి తెలిసిన నాయకుల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఎన్నికలకు నెల రోజుల మాత్రమే సమయం ఉన్నందున ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: