వివాహం అనేది ఒక పవిత్ర బంధం. భార్యభర్తలంటే పెళ్లినాటి ప్రమాణాలు పాటిస్తూ.. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా జీవించాలి. కానీ.. కాలంతో పాటు బంధాలు కూడా మారిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెంది విడాకులు తీసుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్ జూలో ఇవాన్, నియోల్ అనే మగ, ఆడ ఎలుగుబంట్లు పదేళ్ల నుంచి ఒకే బోనులో కలిసిమెలిసి ఉంటూ సందర్శకులను అలరిస్తున్నాయి. వాటిని భార్య, భర్తలుగా పేర్కొంటూ అందరూ వాటి అన్యోన్య దాంపత్యాన్ని చూసిపోతూ ఉంటారు.
దీంతో ఈ ఎలుగుబంట్లు డెన్మార్క్లో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. అయితే, ఇన్నాళ్లూ కలిసిమెలసి ఉన్న ఈ ఎలుగుబంట్లు ఇప్పుడు ఒకదాని ముఖం ఒకటి చూసుకోవడానికి ఇష్టపడడం లేదట. ఈ ఎలుగుబంట్ల మధ్య మనస్ఫర్ధలు ఎందుకు వచ్చాయో ఎవరికీ తెలియదు కానీ, ఆడ ఎలుగుబంటి నియోల్ ఒక్కోసారి కోపం తెచ్చుకుని మానసిక ఆందోళనకు గురవుతుందట.
నియోల్ అప్పుడప్పుడు అసహనానికి.. మానసిక ఆందోళనకు గురై నీళ్లలో దిగి ఈత కొడుతుందట. ఇది గమనించిన జూ అధికారులు వారికి విడాకులు ఇచ్చి దూరం చేస్తున్నారు. త్వరలో ఇవాన్ను జర్స్లాండ్లోని షాండినవియన్ వైల్డ్లైఫ్ పార్క్కి తరలించనున్నారు. నియోల్తో విడాకులు తీసుకొని ఒంటరైన ఇవాన్ ఈ పార్క్లో నునొ అనే మరో ఆడ ధ్రువపు ఎలుగుబంటితో జత చేయనున్నారట అధికారులు.