ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ముఖ్య అతిథిగా హాజరు అయిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ బుధవారం మధ్యాహ్నం గోల్కొండ కోట చేరుకున్నారు. జీఈఎస్కు హాజరైన ఇవాంకా ట్రంప్ రెండో రోజు బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో గోల్కొండ కోటలాంటిది లేదని వ్యాఖ్యానించారు.
ఈ కోటను చూసి ఆమె ముగ్ధురాలయ్యారు. గోల్కొండ కోట నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసారు. ఆమె కాలి నడకన గోల్కొండ కోటలో తిరిగారు. ఇద్దరు గైడ్లు ఆమెకు గోల్గొండ కోట చరిత్ర గురించి చెప్పారు. పలుచోట్ల తిరిగి ఆమె వారి నుంచి విషయాలు తెలుసుకున్నారు. జీఈఎస్కు హాజరయిన 1500మంది ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు అధికారికంగా విందు ఇస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోట సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది. గోల్కొండ కోటకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరు కాలేదు. అయితే ఇవాంకతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శి వచ్చారు.
మొదట ఆమె చార్మినార్ను చూస్తారని భావించారు. కానీ భద్రతా కారణాల వల్ల అది కుదరలేదు. గోల్కొండ కోటను చూసిన అనంతరం ఇవాంకా ట్రంప్ నేరుగా ట్రెండెన్ హోటల్కు వెళ్లారు. గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం సాయంత్రం విందును ఏర్పాటు చేసింది. కానీ ఇవాంకా పాల్గొనే అవకాశం లేదు.