తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న లక్ష్మణ్ గురువారం అస్వస్థతకు గురయ్యారు. దీక్ష విరమించాలని కుటుంబ సభ్యులు కోరినా ససేమిరా అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లక్ష్మణ్తో మాట్లాడారు. దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేయడంతో లక్ష్మణ్ ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నిమ్స్లో లక్ష్మణ్ను పరామర్శించిన కేంద్ర మంత్రి లక్ష్మణ్ చేత మంత్రి దీక్షను విరమింపజేశారు.
అయితే, దీక్ష విరమణ సందర్భంగా కేంద్ర మంత్రి హన్స్ రాజ్ అహిర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని.. దేశంలో ఇంత మంది ఆత్మహత్య లు చేసుకోవడం ఇదే మొదటి సారి అని అన్నారు. 'ఏజెన్సీ తప్పులు బయట పడ్డాయి. అధికారులు, మంత్రి తప్పు కూడా ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. తీసుకోకపోతే కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది' అని వ్యాఖ్యానించారు. సాధారణంగా రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని.. కానీ విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని తాము జోక్యం చేసుకుంటామని చెప్పారు. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రధాని మోడీ చూస్తూ ఊరుకోరని అన్నారు. అయితే, కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటని పలువురు చర్చించుకుంటున్నారు.