హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపుతో జోష్లో
టీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షాలపై ఎదురుదాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణభవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీశాఖల
మంత్రి కే తారకరామారావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ విజయం కోసం పనిచేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హుజూర్నగర్ విజయం
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందని, గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రజలే ఓట్ల రూపంలో సమాధానం చెప్పారని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, లేవనెత్తిన అర్థరహిత ప్రశ్నలన్నింటికీ హుజూర్నగర్ ఉపఎన్నికలో ప్రజలే సమాధానం చెప్పారని కేటీఆర్ అన్నారు. ప్రజలకు సరైన పరిపాలన అందిస్తే వారే కడుపులో పెట్టుకుని దాచుకుంటారంటూ
ముఖ్యమంత్రి చెప్పే మాటలకు.. ప్రజలపై సీఎంకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమే హుజూర్నగర్ ఫలితమన్నారు. ఉప ఎన్నికలో విజయంతో టీఆర్ఎస్ శ్రేణులపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింతగా పనిచేయాలని
మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి హుజూర్నగర్ ప్రజల రుణం తీర్చుకోవాలన్నారు.
స్థానిక ఎమ్మెల్యే,
మంత్రి ఇందుకోసం ప్రత్యేక కృషి చేయాలని చెప్పారు. హామీలను నెరవేర్చుకునేలా
స్థానిక పార్టీ శ్రేణులు కూడా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. గతంలో హుజూర్నగర్లో అధికార దుర్వినియోగం, కక్ష్యసాధింపు చర్యలుండేవని.. కానీ ఇకనుంచి ఆ ప్రాంతంలో ఇలాంటి చర్యలు కనిపించవని పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.
ఉప ఎన్నిక ద్వారా ఏ పార్టీ బలం ఎంతో తేలిపోయిందని.. స్వయంగా
టీపీసీసీ చీఫ్ సొంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారని కేటీఆర్ చెప్పారు. కొంతకాలంగా
బీజేపీ చేస్తున్న మాటల హడావుడి ప్రచార పటాటోపమని తేలిపోయిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు గాలివాటమేనని తేలిపోయిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలమేమిటో ఇప్పటికైనా గుర్తించాలని చురకలంటించారు.
బీజేపీ అంటే బిల్డప్ జనతా పార్టీగా మారిందన్నారు. ప్రతిఎన్నికల్లో కొన్ని గుర్తులు టీఆర్ఎస్ అభ్యర్థులకు నష్టం చేస్తున్నాయని.. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి తప్పు జరుగకుండా పరిష్కారం చూడాలని.. ఈ బాధ్యతను పల్లా రాజేశ్వర్రెడ్డి తీసుకోవాలని సూచించారు.