భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా టీ 20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా వైరల్ అయిన తన ‘జోరు కా గులాం’ (భార్యా దాసుడు) ట్వీట్పై గురువారం వివరణ ఇచ్చారు. ఆస్ర్టేలియాతో భారత్ తలపడిన ఆ మ్యాచ్కు ఆస్ర్టేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వన్డే మ్యాచ్కు డుమ్మా కొట్టి మరీ తన భార్య, మహిళా క్రికెట్ స్టార్ హీలీ కోసం టైటిల్ పోరును వీక్షించేందుకు రావడంపై సానియా ఈ ట్వీట్ చేశారు. మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్కు హాజరవడంపై అందరి ప్రశంసలు అందుకున్నారు. సానియా సైతం స్టార్క్ తీరును కొనియాడుతూ ఇక ఆయనను భార్యాదాసుడు అంటారని చమత్కరించారు. భారత మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్ - స్మ్రితి మంధానల యూట్యూబ్ చానల్ డబుల్ ట్రబుల్ లో తన ట్వీట్ కు అర్థం చెప్పింది సానియా. భర్తలు ఏదైనా సాధిస్తే అది వారి గొప్పతనంగా భావిస్తారని.. ఒకవేళ సాధించకపోతే వారి భార్యల వల్లే సాధించలేకపోయారంటూ సమాజం అంటుందని సానియా చెప్పుకొచ్చింది. వారు అలా ఎందుకు అంటారో తనకు అర్ధం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మనం జోక్ అని చెప్పుకున్నా.. లోతైన విషయం ఉందని అన్నారు.
మహిళను బలహీనతగా సమాజం చూపుతుందని.. బలంగా భావించదని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఈ తత్వం మారాలని ఆమె అభిప్రాయపడింది. దీనికి ఎలాంటి ఆధారం లేకపోయినా తరతరాలుగా ఇలాగే కొనసాగుతోందని.. ఆ విషయం తనకు అనుష్క శర్మకు బాగా తెలుసని వివరించింది. 'ఒకవేళ మా భర్తలు ఆడే మ్యాచ్ చూద్దామని మేము వచ్చామనుకోండి. ఆ మ్యాచ్లో వారు సరిగా ఆడలేకపోయారనుకోండి. ఇక అంతే మా కారణంగానే ఆడలేకపోయారని ఎన్ని మాటలు అంటారో.. భార్య మ్యాచ్ చూడడానికి స్టార్క్ వచ్చినట్లు నేను ఆడే టెన్నిస్ మ్యాచ్కు షోయబ్ వస్తే ఇక అతడిని వదిలిపెట్టరు. భార్యకు బానిసగా మారాడంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడతారు.. అందుకే స్టార్క్ను అలా సంబోధించానని, అతను మహిళా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లేంతగా భార్యకు దాసోహం అయ్యాడని ముద్ర వేస్తారని తాను అలా చమత్కరించానని' సానియా వెల్లడించింది.
Episode 3 of #DoubleTrouble where Smriti and I had a great chat with the tennis legend @MirzaSania. Catch the whole episode by tapping on the link: https://t.co/J862x5UM72 🤘
— Jemimah Rodrigues (@JemiRodrigues) May 6, 2020
PS: There is a special guest appearance 😉 Enjoy peeps!! @mandhana_smriti @baselineventure pic.twitter.com/FtwS3iPKxd