చినబాబు లోకేష్ కూడా మొదలుపెట్టేశాడు. ఇప్పటివరకు ఏ విషయంలో అయినా యూటర్న్ తీసుకోవటం చంద్రబాబునాయుడుకు మాత్రమే అలవాటుగా ఉండేది. అందుకనే చంద్రబాబును వైసీపీ నేతలు సెటైరికల్ గా యూటర్న్ బాబు అని అంటుంటారు. అలాంటిది అదే దోవలో లోకేష్ కూడా వెళుతున్నట్లున్నాడు.  ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో సీఐడీ విచారణకు లోకేష్  బుధవారం హాజరుకావాల్సుంది. అయితే వాయిదా కోరటంతో హైకోర్టు 10వ తేదీన కచ్చితంగా విచారణకు హాజరుకావాల్సిందే అని ఆదేశించింది.





అసలు విషయం ఏమిటంటే ఢిల్లీలో సీఐడీ వాళ్ళు ఇచ్చిన నోటీసును తీసుకున్న తర్వాత లోకేష్ మీడియాతో మాట్లాడుతూ తాను పోరాట యోధుడినన్నారు. తాను విచారణ విషయంలో జగన్మోహన్ రెడ్డి లాగ  వాయిదాలు కోరనని చెప్పారు. తాను ఏ తప్పుచేయలేదుకాబట్టి ఏ విచారణకైనా సిద్ధమన్నారు. ఇంకా తనగురించి చాలా గొప్పలే చెప్పుకున్నారు. అంతఘనంగా చెప్పుకోవటంతో అందరు నిజమే అనుకున్నారు. తీరాచూస్తే హైకోర్టులో వాయిదా కోరుతు పిటీషన్ వేయటమే ఆశ్చర్యంగా ఉంది.





విచారణ వాయిదాకు చెప్పిన కారణాలు వింటే అందరు ఆశ్చర్యపోతారు. కారణాలు ఏమిటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో హెరిటేజ్ కంపెనీ కొనుగోలు చేసిన భూములు, భూములు కొనాలని బోర్డు తీసుకున్న నిర్ణయం మినిట్స్, చేసిన చెల్లింపుల వివరాలను సీఐడీ తీసుకురావాలని లోకేష్ కు చెప్పింది. సరిగ్గా దీనిపైనే లోకేష్ వాయిదా కోరారు. కారణం ఏమిటంటే సీఐడీ అడిగిన వివరాలను లోకేష్ కు ఇవ్వటానికి హెరిటేజ్ కంపెనీ సమయం కావాలన్నదట. ఇంత అర్జంటుగా వివరాలను ఇవ్వలేమని హెరిటేజ్ అధికారులు చెప్పారట.





విచారణకు అవసరమైన రికార్డులు తనకు అందేటప్పటికి కొంచెం సమయం పడుతుందని లోకేష్ తన పిటీషన్లో చెప్పటమే విచిత్రంగా ఉంది. సంస్ధే లోకేష్ కుటుంబానిది. అలాంటిది బోర్డు సమావేశ వివరాలు, భూముల కొనుగోలుకు  చేసిన చెల్లింపుల వివరాలు, మినిట్స్ కావాలంటే ఇంత అర్జంటుగా ఇవ్వలేమని చెప్పిన మహానుభావుడు ఎవరో అర్ధంకావటంలేదు. విచారణకు హాజరుకాకుండా టైం డ్రాగ్ చేయటానికే లోకేష్ ఈ ఎత్తు వేసినట్లు అందరికీ అర్ధమైపోతోంది. ఇంతోటిదానికి తాను వీరుడనని, ధీరుడనని జగన్ లాగ వాయిదాలు కోరనని బీరాలు పోవటం ఎందుకో ?

మరింత సమాచారం తెలుసుకోండి: