
ఎప్పుడో 2021లో జాబ్ క్యాలెండర్ కింద ప్రకటించిన గ్రూపు-2 నోటిఫికేషన్ ను మొన్న విడుదల చేశారని.. కొన్నినెలల కిందట ప్రకటించిన గ్రూపు-1 నోటిఫికేషన్ ను నిన్న జారీచేశారని.. మొన్నటికి మొన్న అదిగో డిఎస్సి.. ఇదిగో డిఎస్సి... అంటూ ఊదరకొట్టి నిరుద్యోగులలో ఆశలు రేకెత్తించి చివరికి ఆ ఊసే లేకుండా చేశారని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. గ్రూపు-2 ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25 న.. గ్రూపు-1 ప్రిలిమ్స్ మార్చి 17 న.. అంటే ఈ రెండింటికీ మెయిన్స్ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోనే జరగుతాయని.. అంటే ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ పరీక్షలు కూడా ఇప్పుడు జరిగే అవకాశం లేదని గంటా శ్రీనివాసరావు అన్నారు.
ఇదంతా జగన్ ముందే తెలుసని.. దీన్ని కూడా ఎన్నికల అస్త్రం గానే వాడుకుంటున్నారని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. నిజంగా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఒక 6నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చేవారని.. ఒక ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్ ఇచ్చి, ఎన్నికల ముందు పరీక్షలు నిర్వహిస్తామనడం నిరుద్యోగుల్ని మోసం చేయడమేనని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. నిరుద్యోగులు గ్రూపు-1, గ్రూపు-2 ఈ రెండింటికీ దరఖాస్తు చేసుకుంటారని.. గ్రూపు-2లో లో కన్న .. గ్రూపు-1 లో అదనపు సబ్జెక్టు లు ఉన్నాయని.. గ్రూపు-2 ప్రిలిమ్స్ జరిగిన 20 రోజుల్లోనే గ్రూపు-1 అదనపు సబ్జెక్టులకు అభ్యర్థులు సిద్ధం కావడం చాలా కష్టమని నిరుద్యోగులు వాపోతున్నారని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు.