గ‌త 24 గంట‌లుగా ఓ వార్త ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నంగా మారింది. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ ఏలూరుకు చెందిన మాగంటి వెంకటేశ్వర రావు (మాగంటి బాబు) పార్టీ మారిపోతున్నారు అంటూ ఒక్క‌టే ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. దీంతో ఈ వార్త అలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో లేదో వెంట‌నే ఏలూరు జిల్లాలో టీడీపీకి బిగ్ షా క్ తలిగే అవకాశాలున్నాయ ని రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేగింది.

ఇక మాగంటి బాబుతో కొంద‌రు వైసీపీ కీల‌క నేత‌లు హైదరాబాద్ లో చర్చలు జరుపుతున్నారని కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో మాగంటి స‌న్నిహితుల‌కు కూడా ఫోన్లో అందుబాటులో లేకుండా పోయారు. అయితే మాగంటి పార్టీ మార్పు నిజ‌మే అన్న ప్ర‌చారం కూడా గ‌ట్టిగానే న‌డిచింది. చాలా వ‌ర‌కు న‌మ్మేశారు. మాగంటి పార్టీలో అసంతృప్తితో ఉన్న మాట నిజ‌మే. ఆయ‌న ఏలూరు లోక్ సభ టిక్కెట్ విషయంలో తీవ్ర అసంతృప్తికి లోన‌య్యారు.

సీటు వేరొక‌రికి ఇస్తాన‌ని చంద్ర‌బాబు క‌నీసం త‌న‌ను పిలిచి మాట మాత్రంగా అయినా చెప్ప‌లేద‌నే బాబు ఆవేద‌న‌గా తెలుస్తోంది. ఇక ఇదే ఏలూరు పార్ల‌మెంటు సీటును టీడీపీ నుంచి ఆశించిన బీసీ నేత  గోరుముచ్చు గోపాల్ యాదవ్ సైతం వైసీపీలో జాయిన్ అవ్వడంతో.. మాగంటి చేరిక కూడా దాదాపు ఖాయమనే అంద‌రూ అనుకున్నారు. అయితే ఈ వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు మాగంటి స్పందించారు.

తాను పార్టీ మారుతున్న‌ట్టు వ‌స్తోన్న వార్తలు అన్నీ అవాస్త‌వాలే అని ఖండించారు. త‌న‌కు టీడీపీని విడిచిపెట్టే ఆలోచన తనకు లేదని.. కేవ‌లం తాను వ్యక్తిగత పనుల నిమిత్తమే హైదరాబాద్ లో ఉండటంతో పాటు క్యాంపు కార్యాలయానికి అందుబాటులో లేక‌పోవ‌డంతో పార్టీ మార్పుపై పుకార్లు వ‌చ్చాయ‌ని మాగంటి చెప్పారు. దీంతో మాగంటి పార్టీ మార్పు పుకార్ల‌కు తెర‌ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి: