వైసీపీ లో మరోసారి అంతర్గత కలకలం చెలరేగిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం ఇప్పుడు పార్టీ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజా అప్‌డేట్‌ ప్రకారం, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, జోగి రమేష్ తాజా చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జోగి రమేష్ కుటుంబంతో కలిసి విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్లి, ప్రజల ముందు ప్రమాణం చేసిన ఘటన పార్టీ హైకమాండ్ దృష్టికి చేరింది. ఈ విషయంపై జగన్‌ గట్టిగా స్పందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. “ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తే, పార్టీలో క్రమశిక్షణ ఎలా ఉంటుంది ? ” అని జగన్ తన సలహాదారుల సమక్షంలో ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాక, జోగి నుంచి స్పష్టమైన వివరణ తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది.


ఇటీవ‌ల నకిలీ మద్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా హడలెత్తించింది. ఆ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అద్దేపల్లి జనార్ధన్‌రావు, పోలీసుల విచారణకు ముందు ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ, తన ప్రోత్సాహంతోనే మద్యం వ్యాపారం సాగిందని ఆరోపించాడు. ఈ వీడియో బయటకు రావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ నేతలు జోగిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. జోగి రమేష్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. “ నాకు అద్దేపల్లి వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ కారణాల వల్లే ఈ ఆరోపణలు వస్తున్నాయి ” అని తెలిపారు. అయినా విమర్శలు ఆగకపోవడంతో, ప్రజా సమక్షంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయాలని ప్రకటించారు. చాలా మంది దీన్ని రాజకీయంగా పరిగణించినా, జోగి నిజంగానే తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి ప్రమాణం చేశారు.


అయితే, ఈ చర్య వైసీపీ నాయకత్వానికి నచ్చలేద‌ని టాక్‌. పార్టీ నైతిక విలువలు, నిర్ణయాలు పక్కనబెట్టి వ్యక్తిగత స్థాయిలో ఈ విధమైన చర్యలు తీసుకోవడం సరైనది కాదని జగన్ అభిప్రాయపడ్డారట. ప్రస్తుతం పార్టీ ఒక సున్నితమైన దశలో ఉందని, ఇలాంటి విషయాలు వైసీపీకి నష్టం కలిగించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. జోగి రమేష్ వివరణ తర్వాతే పార్టీ త‌ర్వాత పిలిచి మాట్లాడే అవ‌కాశం ఉంది. ఏదేమైనా, ఈ ఘటనతో వైసీపీ లో మరోసారి అంతర్గత విభేదాలు, అసంతృప్తులు బహిర్గతం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: