త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న నటుడు కమల్ హాసన్.. తమిళనాడులోని పలు పార్టీల అధినేతలను కలుస్తున్నారు.కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తో కమల్ ఇప్పటికే కలిశారు. ఇక అప్పట్లోనే తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే సుప్రిమో కరుణానిధిని కలిశారు కమల్. ఇక గత వారంలో కూడా వరసగా కమల్ రాజకీయ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రజనీకాంత్, కరుణానిధిలతో భేటీ అయిన కమల్.. ఇవాళ డీఎండీకే నేత విజయ్ కాంత్ ను కలిశారు.
ట్విస్ట్ ఏంటంటే..గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు ఈ హీరో. అప్పటి నుంచి కామ్ అయిపోయాడు. అయితే ఇటీవల రజనీ, కమల్ లపై విజయ్ కాంత్ పంచ్ లు వేశాడు.వాళ్లు రాజకీయాల్లో తనకన్నా జూనియర్లే అని ఆయన అన్నాడు. ఈ నేపథ్యంలో కమల్ ఆయనతో సమావేశం అయ్యాడు. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశాడట కమల్. అలాగే రాజకీయాల్లో విజయ్ కాంత్ తనకన్నా సీనియర్ అనే విషయాన్ని కమల్ కూడా ఒప్పుకున్నాడు.
ఈ నెల 21 న మధురై నుంచి ప్రారంభించబోతున్న యాత్రపై విజయ్ కాంత్ తో చర్చించారు కమల్. పార్టీ విధి విధానాలు ఇప్పటికే ఖరారయ్యాయని, తమిళనాడు ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే రాజకీయాల్లో వస్తున్నట్లు చెప్పారు కమల్. అయితే అన్ని పార్టీల నేతలను కలుస్తున్న కమల్.. వారి సలహాలు, అభిప్రాయాలు తీసుకుంటున్నారు.