ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో టికెట్ల వేటలో అభ్యర్థులు మునిగిపోయారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ దక్కించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఒక్క టికెట్ కోసం పార్టీలోనే ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. పోటీ ఇంతలా ఉంటే.. ఒక లోక్సభ నియోజకవర్గంలో మాత్రం కీలక నాయకుడు టీడీపీ టికెట్ ఇస్తామంటేనే భయపడుతున్నారు. పిలిచి మరీ.. నువ్వే పోటీచేయాలని అధిష్టానం కోరుతుంటే.. పోటీలో ఉండే సమస్యే లేదంటున్నారు. `నాకు టీడీపీ టికెట్ అసలు వద్దు. నేను పోటీ చేయను` అంటూ కీలక నేత అస్త్ర సన్యాసం చేసేస్తున్నారు. మరోసారి చేతులు కాల్చుకోవడం ఎందుకు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు లోక్సభకు పోటీచేసేందుకు టీడీపీ నుంచి సీనియర్ నేత ఆదాల ప్రభాకర రెడ్డి ససేమిరా అంటున్నారట. టికెట్ ఇస్తామంటే హడలి పోతున్నారట.
ఎవరు ఔనన్నా.. కాదన్నా.. వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రత్యేకహోదా అంశం మరోసారి కీలకం కానుంది. ప్రజలు కూడా సమయం వచ్చినప్పుడు తమ నిర్ణయం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ హోదా ఇవ్వాల్సిందే అంటూ కేంద్రాన్ని నిలదీస్తున్నారు. హోదా కోసం పోరాటాలు చేశామని ప్రజలకు గుర్తుచేస్తున్నారు. హోదా తెచ్చేందుకు తుది వరకూ పోరాడామని చెప్పేందుకు ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్ముతున్నారా లేదా అనే విషయం కాసేపు పక్కన పెట్టేద్దాం! ఇక ప్రత్యేక హోదా కోసం వైసీపీ గట్టిగానే పోరాడుతోంది. తొలి నుంచి హోదా సాధించేందుకు యువభేరి, ఇతర సదస్సులు పెట్టి ఆ పార్టీ అధినేత జగన్.. హోదా ఆశలను సజీవంగా ఉంచేలా చేశారు. ఇక కేంద్రంపైనా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు.
అవిశ్వాస తీర్మానం, ఎంపీల రాజీనామా వంటి నిర్ణయాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చారు. పోరాడకుండా ఉన్న టీడీపీ కంటే.. అంతో ఇంతో పోరాడుతున్న వైసీపీనే బెటర్ అనేలా చేసుకోగలిగారు. ప్రస్తుతం ఇదే టీడీపీ నేతల్లో భయం పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో ధైర్యంగా ఓట్లడిగే హక్కు ఒక్క జగన్ కే ఉందని ప్రజలు భావిస్తుండటం వైసీపీకి కలిసొచ్చే అంశం. వచ్చే ఎన్నికల్లో వైసీపీపై పోటీ చేసేందుకు టీడీపీ నేతలు ముందుకు రాకపోవడం సీఎం చంద్రబాబుకు కలవరపాటుకు గురిచేస్తోంది. నెల్లూరు లోక్ సభకు గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డినే మరోసారి బరిలో దింపాలని చంద్రబాబు భావిస్తున్నారట. కానీ, ఆయన ఎంపీ టికెట్ అంటేనే ఆమడ దూరం వెళ్లున్నారట.
ఈ విషయంపై చంద్రబాబు ఎక్కడ ఒత్తిడి చేస్తాడోనని అసలు అమరావతిలో అడుగుపెట్టడమే మానేశారట. వరుసగా వైసీపీ తరుపున గెలుస్తున్న మేకపాటి రాజమోహన్ రెడ్డిపై పోటీ చేసి మళ్లీ మళ్లీ తాను చేతులు కాల్చుకోలేనని, వీలైతే ఏదైనా అసెంబ్లీ సీటివ్వాలని లేనిపక్షంలో రాజకీయాలకైనా దూరంగా ఉంటాను కానీ, నెల్లూరు పార్లమెంట్ రేసులో మాత్రం తాను ఉండనని తేల్చిచెప్పేశారట. ఒక్క ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రమే కాదు, దాదాపుగా వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన ప్రతీచోట టీడీపీకి ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక మరికొన్ని చోట్ల మాత్రం ఆర్థికంగా పార్టీ ఆదుకుంటామని భరోసా ఇస్తే, తాము సాహసం చేస్తామని,లేకపోతే పోటీకి దిగబోమని లీకులు ఇస్తున్నారట.