సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి మరోమారు తన గళం విప్పారు. “ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు” అనే సినిమాతో తెరమీదకు వస్తున్న పోసాని తాజాగా ఈ సినిమా విషయంలో తెరమీదకు వచ్చిన వివాదంతో స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై పోసాని కృష్ణమురళి ఎవరో కంప్లయింట్ ఇస్తే ఎన్నికల అధికారులు దీనిపై తనను సంజాయిషీ అడగడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు ఎన్నికల అధికారులకు తాను వివరణ, సంజాయిషీలు ఇచ్చుకున్నాననీ… ప్రతిసారి తనను అమరావతి రమ్మంటే ఎలా వీలుపడుతుందని అన్నారు. ఎన్నికల అధికారుల తీరు బాగాలేదన్నారు పోసాని. చంద్రబాబుపై నేను లేఖలు రాస్తే ఆయన్ను కూడా పిలిపిస్తారా అని ప్రశ్నించారు. అసలు తన సినిమా ఏ సీఎంను ఉద్దేశించింది కాదని అన్నారు.
ఈ సినిమాను కోరినవాళ్లకు ముందే చూపిస్తాననీ.. సినిమా విడుదలకు అధికార పార్టీ అడ్డుకోవద్దని అన్నారు. చంద్రబాబును తిట్టాలంటే సినిమా తీయాలా అని ప్రశ్నించారు. ఓ సీఎం మేనిఫెస్టో అమలుపై జనానికి ఏం చెప్పాడు.. అది చేశాడు అన్నది మాత్రమే తన సినిమాలో ఉంటుందని పోసాని చెప్పారు. ఎన్నికల సంఘంపై గౌరవంతో తాను వివరణ ఇస్తున్నానని చెప్పారు. తానెవరినీ దూషిస్తూ సినిమా చేయలేదని.. ‘ఆపరేషన్ దుర్యోధన’లాగా సమకాలీన రాజకీయాల నేపథ్యంలో తీశానంటూ మూడు పేజీల లేఖ పంపినప్పటికీ, స్వయంగా అమరావతికి రావాలంటూ లేఖ పంపడంలో అర్థం ఏంటి?. ఈ రోజు చిత్తూరు నుంచి మోహన్రావు అనే వ్యక్తి మీకు లేఖ రాస్తే ఎన్నికల సంఘం నన్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరుతోంది. రేపట్నుంచి ప్రతిరోజూ ఒకరు ఫిర్యాదు చేస్తారు. వాటన్నిటి కోసం నేను రోజూ అమరావతికి తిరుగుతుండాలా?’‘ఎన్నికలతో సంబంధం లేకుండా నేను ఆర్నెళ్ల ముందే ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ అనే సినిమాని మొదలు పెట్టాను.`` అని వివరించారు.