ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్ లో 25 మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. అయితే ఎవరి మనసు నొప్పించకుండా చాలా జాగ్రత్తగా తన టీం సిద్ధం చేసుకున్నారు. తనకు మొదటి నుంచి మద్దతు ఇచ్చినవారు..తనను బాగా నమ్మిన వారికే ఆయన తన కేబినెట్ లో చోటు ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారిలో విజయనగరం జిల్లా కురుపాం శాసన సభ్యురాలు పాముల పుష్పశ్రీవాణి ఒకరు. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో యంగ్ మినిస్టర్ గా ఆమె గుర్తింపు పొందారు.
గతంలో కురుపాం నియోజకవర్గం నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో టీడీపీ జోరు కొనసాగుతున్నప్పటికీ..ఆమెను ఎంతో మంది టీడీపీ నేతలు ప్రలోభ పెట్టినప్పటికీ పార్టీ మారలేదు. ఒకదశలో కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీలో చేరిపోయినప్పటికీ పాముల పుష్పశ్రీవాణి మాత్రం పార్టీ మారలేదు. చివరికి టీడీపీ నేతలు ఆమె భర్త పరీక్షిత్ రాజు సైతం ప్రలోభ పెట్టి ఆమెను తమ పార్టీలో చేర్చుకోవడానికి విఫల యత్నాలు చేశారు.
కానీ ఆమె మాత్రం పార్టీ వీడేది లేదని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి కురుపాం నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర చేసే సమయంలో కట్టేకాలేవరకు జగన్ అన్నతోనే ఉంటానని ఆమె ప్రామిస్ చేశారు. ఆ మాటలే సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆమెపై అమితమైన గౌరవం పెరిగింది. ఆనాడే చెల్లి పుష్పశ్రీవాణిని గుండెల్లో పెట్టుకుంటానంటూ మాట ఇచ్చారు జగన్.
అలా పాదయాత్రలో ఇచ్చిన మాటకు విలువనిచ్చిన వైయస్ జగన్ తన కేబినెట్ లో పుష్పశ్రీవాణికి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ..సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన బాధ్యత చాలా పెద్దదని..ఆ బాధ్యత సక్రమంగా నెరేరుస్తానని..జగన్ అన్నను నమ్మినవారు ఎప్పటికీ బాధపడరని అన్నారు.