ముంబై: వివాహబంధానికి ఎంతో వివలువనిచ్చే మన దేశంలో అక్రమ సంబంధాల కేసులు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు ఈ మధ్య అనేక చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఇలాంటి ఓ ఘటనే జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. చందూ మహాపూర్‌ అనే వ్యక్తికి ఇదివరకే పెళ్లి అయ్యింది.
           
పెళ్లి అయినా స్థానికంగా ఓ యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ యువతికి వేరొకరితో పెళ్లి కుదిరింది. కానీ ఆమె ఆ పెళ్లి చేసుకోకుండా చందూ మహాపూర్ అడ్డు తగులుతున్నాడు. తనతోనే ఉండాలని, ఆ పెళ్లి చేసుకోవద్దంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది. అతడిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

దీనికోసం చందూ మహాపూర్ సమీప బంధువు గుర్జార్‌ని సంప్రదించింది. అతడికి ఎవ్వరూ ఊహించలేని ఆఫర్ ఇచ్చింది. చెప్పినట్టు చేస్తే లక్షన్నర రూపాయలు ముట్టచెప్పడంతో పాటూ ఓ పూట అతడితో ఏకాంతంగా గడుపుతా అని ఆశ పెట్టింది. భరత్ గుర్జార్‌కి చందూ మహాపూర్‌కి ఆస్తితగాదాలు ఉన్నాయి. దీంతోపాటు యువతి ఆఫర్ కూడా నచ్చడంతో చందూను హత్య చేయడానికి సిద్ధమయ్యాడు. పక్కా ప్లాన్ రెడీ చేశాడు. మద్యం సేవిద్దాం రమ్మంటూ చందూను నిర్మానుష్య ప్రాంతానికి తీసికెళ్లి, అక్కడ అతడి తల పగలకొట్టాడు. అప్పటికీ కొనఊపిరితో ఉండడంతో గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఓ క్రషర్ మైన్ వద్ద పారేశాడు.

గుర్తుతెలియని మృతదేహం ఉందంటూ సమాచారం రావడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. గుర్జార్‌ స్వయంగా చందూను అక్కడకు తీసుకెళ్లినట్లు తెలుసుకుని అతడిని అరెస్టు చేశారు. హత్యకు సుపారీ ఇచ్చిన యువతితోపాటు ఆమెకు సహరించిన తల్లిదండ్రులపై కూడా పోలీసుల కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: