నితిన్ ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు పైనే అవుతుంది. ఈ 18 ఏళ్లలో హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువ. అయినా గాని సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. జయం సినిమాతో 2002 లో హీరోగా అడుగుపెట్టిన నితిన్, ఆ తర్వాత దిల్, సంబరం, శ్రీఆంజనేయం, సై,  ఇలా చాలా సినిమాల్లో నటించారు. దిల్, సై సినిమాల తర్వాత 2005 నుంచి 2011 వరకూ 12 సినిమాల్లో నటించారు.

కానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. దాదాపు ఏడేళ్లు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో ఇష్క్ రూపంలో మళ్ళీ సక్సెస్ గాడిలో పడ్డారు. ఆ తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, అ ఆ వంటి సినిమాలతో ఫామ్ లోకి వచ్చారు. మధ్యలో చిన్నదాన నీకోసం, లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి. అ..ఆ మూవీ తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్, భీష్మతో మరోసారి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం నితిన్, బాలీవుడ్ అందాదూన్ తెలుగు రీమేక్ లోనూ, పవర్ పేట, రంగ్ దే, చెక్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే 18 ఏళ్ల నితిన్ నట ప్రస్థానంలో ఒక ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. అదేంటంటే నితిన్, ఇప్పటివరకూ తేజతో తప్ప ఏ డైరెక్టర్ తోనూ రెండోసారి కలిసి సినిమా చేయలేదు. జయం, ధైర్యం సినిమాలతో తేజతో రెండు సార్లు కలిసి పనిచేసిన నితిన్,...వివి వినాయక్, రాజమౌళి, రాఘవేంద్రరావు, విక్రమ్ కుమార్, విజయ్ కుమార్ కొండ, కరుణాకరన్, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకుల సినిమాల్లో నటించారు. అయితే వీళ్లతో కేవలం ఒకసారి మాత్రమే కలిసి పనిచేశారు. తాజాగా నితిన్, దర్శకుడ్ని రిపీట్ చేయబోతున్నారు. ఛల్ మోహన్ రంగ సినిమాను డైరెక్ట్ చేసిన కృష్ణచైతన్యతో కలిసి రెండోసారి పని చేయబోతున్నారు. కృష్ణచైతన్య పవర్ పేట సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అలా నితిన్, తన కెరీర్ లో కేవలం ఇద్దరు దర్శకులని మాత్రమే రిపీట్ చేశారు. అయితే తేజతో జయం తర్వాత ధైర్యం సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు కృష్ణచైతన్యతో రిపీట్ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందో లేదో అని అభిమానులు ఆందోళనలో ఉన్నారు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం హిట్ అవ్వడం పక్కా అంటున్నారు. ఎందుకంటే కృష్ణచైతన్యతో ఛల్ మోహన్ రంగ ఫ్లాప్ అయ్యింది కాబట్టి పవర్ పేట సినిమా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రివర్స్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే నితిన్ సినిమాలకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఏంటంటే నితిన్ తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు. అయితే వారిలో సదా, జెనీలియా, నిత్యమీనన్, మేఘాఆకాష్ లు మినహా మిగతా హీరోయిన్స్ తో కేవలం ఒకసారి మాత్రమే నటించారు. సదాతో చేసిన జయం హిట్ అవ్వగా, టక్కరి ఫ్లాప్ అయ్యింది. జెనీలియాతో చేసిన సై హిట్ అవ్వగా, రామ్ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే నిత్యామీనన్ తో చేసిన ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ మేఘాఆకాష్ తో కలిసి నటించిన లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: