మలయాళంలో సూపర్ స్టార్ నటుడు ఎవరు అంటే ముందుగా వచ్చే పేరు మోహన్ లాల్. తన నటనతో ఇప్పటికి ఆకట్టుకుంటున్నాడు. తనదైన నటనతో, హుందాతనంతో ఆకట్టుకునే ఈ నటుడు ప్రతి ఒక్కరితో మంచి పరిచయాలు కలిగి ఉన్నాడు. యంగ్ హీరోలకు ధీటుగా వరసగా భారీ సినిమాలు చేయడమే కాదు.. ఇతర భాషా చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. తెలుగులో జనతాగ్యారేజి సినిమాలో ఎన్టీఆర్ కు పెదనాన్నగా నటించి మెప్పించాడు. అటు తమిళంలో కూడా వరసగా సినిమాలు చేస్తున్నాడు ఈ హీరో.
ఇదిలా ఉంటె, ఈ హీరోపై కేరళ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఏడేళ్ల క్రితం మోహన్ లాం అక్రమంగా ఏనుగు దంతాలను కొనుగోలు చేశారు. అప్పుడే ఆ విషయం బయటకు వచ్చింది. 2012లోనే ఐటి అధికారులు మోహన్ లాల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఎర్నాకుళంలో ఉన్న అయన ఇంట్లో నాలుగు ఏనుగు దంతాలు దొరికిన సంగతి తెలిసిందే. అయితే, మరో వ్యక్తి లైసెన్స్ ద్వారా ఆ దంతాలను కొనుగోలు చేసినట్టు మోహన్ లాల్ పేర్కొన్నాడు.
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకోవడం శిక్షార్హమైన నేరం. అయితే 2012లోనే స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మోహన్లాల్పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కేసును రద్దు చేశారు.అటవీ శాఖ చట్టానికి సంబంధించిన అంశాలలో సవరణలు చేసిన తర్వాత మోహన్లాల్ ఆ దంతాలను ఇంట్లోనే ఉంచుకోవచ్చని కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దాంతో మోహన్ లాల్ ఆ దంతాలను ఇంట్లోనే ఉంచుకున్నారు. ఇప్పటి వరకు దానిపై ఎవరు ప్రశ్నించలేదు. అయితే, మోహన్ లాల్ కు ఏనుగు దంతాలను ఇచ్చిన వ్యక్తిపై ఆ రాష్ట్రానికి చెందిన ఓ సామజిక వేత్త కేరళ హైకోర్టులో కేసు దాఖలు చేశారు.
ఈ కేసును పరిశీలించిన హైకోర్టు సెక్షన్ 39 (3)కింద మోహన్ లాల్ కు శిక్షించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ కేసులో సవరణలు చేసి తప్పించినా.. ఇప్పుడు కేరళ హైకోర్ట్ జోక్యం చేసుకోవడంతో మోహన్ లాల్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. పోలీసులు మోహన్ లాల్ పై ఛార్జీషీట్ ఫీల్ చేయకపోవడంతో.. వారిని మందలించింది. దీంతో పోలీసులు కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది. అయితే, ఈ కేసు విషయంపై మోహన్ లాల్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇంటికి అందంకోసం కొనుగోలు చేసిన ఏనుగు దంతాలు మోహన్ లాల్ కు పెద్ద తిప్పలు తెచ్చిపెడతాయని అసలు ఊహించలేదు.