అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడనే చెప్పుకోవాలి. అయితే దాని తర్వాత వచ్చిన గీత గోవిందం కూడా విజయ్ కి మంచి పేరును తీసుకు రావడంతో పాటు స్టార్ డమ్ ని కూడా తెచ్చి పెట్టింది. దాదాపు అరవై కోట్ల వసూళ్ళు సాధించి స్టార్ హీరోల సరసన చేర్చింది. అప్పటి నుండి విజయ్ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి.


అయితే మధ్యలో వచ్చిన టాక్సీవాలా లాంటి చిత్రాలు సరిగా ఆడకపోయినా,అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే మొన్న వచ్చిన డియర్ కామ్రేడ్ విజయ్ అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చింది. సినిమా బాగుందని విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ, రన్ టైం ఎక్కువ ఉండడంతో ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అయ్యారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.


ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నానని విజయ్ ప్రకటించాడు. ఆ సినిమాకి "వరల్డ్ ఫేమస్ లవర్" అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే షూటింగ్‌ మొదలైన ఈ చిత్ర తదుపరి షెడ్యూల్‌ యూరప్ లో ఉండనుందట. పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి యూరప్ లోని అందమైన లొకేషన్లను ఎంపిక చేశారు. 


ఇక త్వరలోనే యూరప్‌ చెక్కేయడానికి ‘వరల్డ్‌ ఫేమస్‌’ లవర్‌ యూనిట్‌ అంతా కూడా రెడీ అవుతున్నారు. యూరప్‌ వెళ్లడానికి ఏర్పాట్లలో విజయ్‌ చాలా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన రాశీఖన్నాతో పాటు ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా సహా మరో హీరోయిన్ కూడా నటిస్తుంది. మరి ఈసారైనా విజయ్ దేవరకొండ మెప్పిస్తాడా లేదా చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: