రాజకీయాలలో ఉన్న వారికి పరిణితి, పరిపక్వత ముఖ్యం. ఇదే విషయాన్ని రాజకీయాలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అవకాశం వచ్చినప్పుడల్లా పేర్కోంటుంటారు. అధఃపాతాళానికి జారిపోయిన కాంగ్రెస్ పార్టీలో పునరుత్తేజాన్ని నింపాలంటే రాహుల్ గాంధీ శీఘ్రగతిన తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని పులువురు సీనియర్లు ఆయనకు పదే పదే సూచిస్తుంటారు. నిలకడైన రీతిలో చోరవ ప్రదర్శించాలని కూడా వారు ఆయనకు సూచనలు చేశారు. అయితే యువరాజా వారు వారి మాటలను అంతగా చెవికెక్కుంచుకున్నట్లు లేదని ఆయన చర్యలు చెప్పకనే చెప్పాయి. తలచుకున్నప్పుడు వచ్చి, ఇష్టం లేనప్పుడు దూరంగా ఉండటమన్నది రాజకీయాలలో వీలు కాదనే విషం రాహుల్ గాంధీ గుర్తించాలి. ఎప్పడు పడితే అప్పుడు విహార యాత్రలకు వెళ్లడం రాజకీయాలలో ఏ మాత్రం తగదు అని ఢిల్లీ లోని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీకి చెందిన ఆచార్యుడు సంజయ్ కుమార్ ఒక సందర్భంలో పేర్కోన్నారు కూడా.
రానున్న కొద్ది నెలల్లో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రె స్ పార్టీ చావో రేవో తేల్చుకోవాల్సి వస్తోంది. ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని కూడా ఆ పార్టీ నేతలపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఆయన రాజకీయ పరిణితిని చెప్పకనే చెప్పింది. అంతే కాదు ప్రతిపక్ష నేతల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన సిఫార్సులను, సూచనలను పరిగణలోకి తీసుకుందని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పేర్కోన్నారు. సామాజిక మాధ్యమాలలో ఆయన తన అభిమతాన్ని ప్రజలకు అందించారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసును అందించేందుకు మందుకు వచ్చిందని, ఇది తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కోంటూ, భారత్ లోని ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని రాహుల్ గాంధీ అభ్యర్థించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజల నుద్దేశించి బూస్టర్ డోస్ పై ప్రకటన చేసిన కొద్ది గంటలకో రాహుల్ గాంధీ తన సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం. ఉత్తర భారతావనిలో ఎన్నికల వేడి ఎక్కువగా ఉన్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరోకరు విమర్శల జడివాన కురిపించుకుంటున్నారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరి అభిప్రాయానికి మరోకరు మద్దతు పలకడం ప్రాధాన్యతను సంతరించుకుంది.