టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు కంట్లో నలుసుగా మారిన అసమ్మతి నేత కరణం బలరాంతో చేసిన స్నేహం.. మంత్రి శిద్దా రాఘవరావుకు పెను ప్రమాదాన్ని మోసుకొచ్చింది. అధినేత చంద్రబాబు వద్ద పరువు తీసేసింది. ఇప్పుడు శిద్దా అంటే చంద్రబాబు దగ్గర ఓ చిత్తు కాగితం అనే పరిస్థితి ఏర్పడిందని సమాచారం. విషయంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వైసీపీ నుంచి గొట్టిపాటి రవిని పార్టీలోకి చేర్చుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రువ్వారు. దీంతో ఏకంగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. కరణానికి పార్టీ పదవిని ఊడబీకి గట్టిగా బుద్ధి చెప్పారు.
ఇక, కరణం బలరాంతో చెలిమి చేస్తూ.. జిల్లాలో గొట్టిపాటికి ఇబ్బందులు సృష్టిస్తున్న మంత్రి సిద్దా రాఘవరావుపైనా చంద్రబాబు అసహనంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన అత్యంత కీలకమైన సిఫారసును ఒకదాన్ని బాబు బుట్టదాఖలు చేశారు. ఇటీవల రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు జరిగాయి. జిల్లా పోలీసు యంత్రాంగంపై ఎస్పీ తర్వాత పట్టున్న అధికారి కావడంతో డీఎస్పీ పోస్టుకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో డీఎస్పీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తావు ఇవ్వకూడదని భావించిన చంద్రబాబు.. స్వయంగా తానే ఈ బదిలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి సంబంధించి సిద్దా చేసిన సిఫారసును బాబు బుట్టదాఖలు చేసి, తనకు నచ్చిన వారిని నియమించారు.
గతంలో దర్శి నియోజకవర్గంలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తికి సోదరుడైన వ్యక్తిని ఆయన స్థానంలో నియమించాలని మంత్రి శిద్దా ముఖ్యమంత్రిని కోరారు. అదేసమయంలో అంతకు ముందు మంత్రి సిఫార్సు చేసిన వ్యక్తిని బదిలీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు మంత్రి శిద్దా తెలుసుకున్నారు. ఆయనను బదిలీ చేయవద్దని శిద్దా కోరినప్పటికీ ముఖ్యమంత్రి అంగీకరించలేదు. ఒకవేళ ఆయనను బదిలీ చేయాలని భావిస్తే...ఆయన స్థానంలో ఆయన సోదరుడ్ని నియమించాలని 'శిద్దా' కోరినా దానికి కూడా ముఖ్యమంత్రి అంగీకరించలేదు.
మంత్రి శిద్దా రాఘవరావు సిఫార్సు చేసిన పోలీసు అధికారికే ఎమ్మెల్సీ కరణం బలరాం మద్దతు ఇచ్చినా ముఖ్యమంత్రి ఎందుకో వారిద్దరి విన్నపాలను తోసిపారేశారు. గతంలో గురజాల డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించి సెలవుపై వెళ్లిన పోలీసు అధికారినే దర్శి డీఎస్పీగా ముఖ్యమంత్రి నియమించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని దృష్టిలో పెట్టుకునే ఆ నియామకాన్ని జరిగినట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా.. కరణంతో చెలిమి.. సిద్ధాకు బాబు దగ్గర పరువు పోయేలా చేసిందని అద్దంకి టీడీపీ నేతలు అంటుండడం గమనార్హం. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.