ఒక పట్టాన ఎవరికీ అర్ధం కాదు చంద్రబాబునాయుడు వైఖరి. ఒక్కోసారి ఆయన ఆలోచనలు మరీ ఇంత చవకబారుగా ఉంటాయా అని కూడా అనిపిస్తుంటుంది. నాలుగేళ్ళు ఎన్డీఏలో బిజెపితో అంటకాగిన చంద్రబాబు వచ్చేఎన్నికలను దృష్టిలొ పెట్టుకుని హటాత్తుగా మైత్రీబంధాన్ని తెంపుకున్నారు. నాలుగేళ్ళు ఏపిలో ప్రత్యేకహోదా అన్న మాటకూడా వినబడకుండా చాలా ప్రయత్నాలే చేశారు. హోదా కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి సభలకు విద్యార్ధులను వెళ్ళకుండా ప్రయత్నించారు. హోదా ఆందోళనల్లో పాల్గొన్నవారిపై కేసులు పెట్టారు. ఇలా..ఏవేవి చేయకూడదో అన్నీ చేశారు చంద్రబాబు.
జగన్ వల్లే హోదా డిమాండ్ సజీవం
అదే సమయంలో రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేకహోదానే ఊపిరంటూ వైసిపి అధ్యక్షుడు జగన్ ఎన్నో ఆందోళనలు చేశారు. నిజానికి హోదా డిమాండ్ సజీవంగా ఉందంటే అందుకు జగనే కారణమని చెప్పాలి. పార్లమెంటులో వైసిపి పోరాటాలు చేసినపుడు టిడిపి ఏనాడూ మాట్లాడలేదు. రాష్ట్రంలో బిజెపి, టిడిపిలపై పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే చివరకు బిజెపితో చంద్రబాబు కటీఫ్ చెప్పారు. హోదా డిమాండ్ పైనే వైసిపి ఎంపిలు రాజీనామాలు చేయమే కాకుండా ఏపి భవన్లో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు.
ఏనాడు పట్టించుకోని చంద్రబాబు
రాష్ట్రంలో కోసం తాము చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలంటూ జగన్ చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. తమ ఎంపిలతో పాటు టిడిపి ఎంపిలను కూడా రాజీనామాలు చేయమంటే ఎగతాళి చేశారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిమ్మన్నా చంద్రబాబు ఇవ్వలేదు. సరే, చివరకు వైసిపి ఎంపిల రాజీనామాలు ఆమోదం కూడా పొందాయి.
వైసిపి ఎంపిల రాజీనామాలు తప్పట
ఇటువంటి నేపధ్యంలో వైసిపి ఎంపిల రాజీనామాలు చేయటం తప్పంటున్నారు చంద్రబాబు. లోక్ సభలో తాము ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి ఎంపిల మద్దతు అవసరమైంది. అందుకనే వైసిపి ఎంపిలు రాజీనామాలు చేసుండకూడదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వైసిపి ఎంపిలు రాజీనామాలు చేసి తప్పుచేశారని చంద్రాబాబు అంటున్నారు. పైగా బిజెపికి సహకరించేందుకే వైసిపి ఎంపిలు రాజీనామాలు చేశారంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు. చూశారా ? చంద్రబాబు ఆలోచనలు ఎంత చవకబారుగా ఉన్నాయో ?
డ్రామా ఎలా ముగుస్తుందో ?
అప్పట్లోనే జగన్ పోరాటంలో చంద్రబాబు కూడా కలుసుంటే ప్రత్యేకహోదా వచ్చి ఉండేదేమో ? కానీ బిజెపితో అంటకాగిన చంద్రబాబు హోదా అంటేనే మండిపడేవారు. హోదాపై నాలుగేళ్ళల్లో ఎన్ని పిల్లి మొగ్గలేసింది అందరూ చూసిందే. అటువంటి చంద్రబాబు హోదా కోసం మొదటి నుండి తానే పోరాడుతున్నంత బిల్డప్ ఇస్తున్నారు ఇపుడు. సరే, ఎవరి పోరాటాలు ఏంటి ? దేనికోసమో గ్రహించలేనంత అమాయకుడు కారు కదా జనాలు. పైగా లోక్ సభలో ఎటూ వైసిపి ఎంపిలు లేరనే చంద్రబాబు తాజా డ్రామాలు మొదలుపెట్టారు. మరి ఈ డ్రామా ఎలా ఎండ్ అవుతుందో చూడాల్సిందే.