ఏపీలో అధికార టీడీపీలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కంటే రాజకీయంగా చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత కరణం బలరాం రాజకీయ అనుభవం చంద్రబాబు కంటే ఎక్కువ. ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసినప్పటి నుంచి చూస్తే బాబు కంటే రాజకీయంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తే. అయితే కాలం కలిసిరాక మధ్యలో పలు పార్టీలు మారి చివరకు టీడీపీలో సెటిల్ అయ్యారు. దురదృష్టవశాత్తు కరణం గత రెండు ఎన్నికల్లోనూ ఓడుతూ టీడీపీకి, అటు బాబుకు పెద్ద గుదిబండలా మారిపోయారు.
అద్దంకిలో గత రెండు ఎన్నికల్లోనూ వరుసగా కరణంతో పాటు ఆయన కుమారుడు వెంకటేష్ కూడా గొట్టిపాటి రవి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో కరణం ఓడిపోయాక ఆయన్ను వదిలించుకోవాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారు. రవిని టీడీపీలోకి తీసుకున్నాక కరణం రెచ్చిపోవడంతో చంద్రబాబు కరణంను శాంతపరిచేందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. చివర్లో చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి వెళ్లిపోవడంతో కరణంను బాబు అద్దంకి నుంచి రవికి ఇబ్బంది లేకుండా తప్పించే క్రమంలో ఆయన్ను చీరాలకు పంపారు.
ఈ ఎన్నికల్లో కరణం చీరాల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక అక్కడ ఆమంచి కృష్ణమోహన్… ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా, మరోసారి సొంతపార్టీ నవోదయ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో ఉన్నారు. పార్టీ మారినప్పుడు ఆమంచి చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబును బలరాంను ఏదోలా వదిలించుకోవాలని చీరాలకు పంపినా అక్కడ కరణం గెలుపు సులువు కాదని పోలింగ్ చెప్పేసింది. చీరాలలో లోకల్, నాన్లోకల్ ఫీలింగ్ రావడంతో ఇక్కడ ఆమంచికే స్వల్ప ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తోంది.
నియోజకవర్గంలో ఆమంచికి సొంత బలమే 40 వేల వరకు ఉంది. అందుకే ఆయన గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా కూడా గెలిచారు. ఈ సారి వైసీపీ ఓటు బ్యాంకు కూడా తోడు అయ్యింది. దీంతో పాటు ఆమంచి వ్యూహాలు పన్నడంలో దిట్టకావడంతో కరణంకు ముచ్చెమటలు పట్టాయి. టీడీపీలో సీటు ఆశించిన నేతలందరూ ఏకతాటి పైకి వచ్చారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావుతో పాటు వైసీపీ నుంచి వచ్చిన చేరిన యడం బాలాజీ సయితం గట్టిగానే పనిచేసినా ఆమంచి ఒక్కడే అటు సింగిల్ హ్యాండ్తో పోటీ ఇచ్చి విజయం అంచుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక చంద్రబాబు సైతం బలరాంను ఏదోలా వదిలించుకోవాలనుకునే క్రమంలోనే ఆయన్ను చీరాలకు పంపారని... ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇక ఆయన రాజకీయ జీవితానికి బాబే ఫుల్స్టాప్ పెట్టేసినట్టే అన్న గుసగుసలు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. మరి బలరాం జీవితం ఏం అవుతుందో ? ఎన్నికల ఫలితాల తర్వా తేలనుంది.