అపరభగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో మరో అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకా న్ని నిర్మించి ప్రపంచాన్ని అబ్బురపర్చారు. తాజాగా.. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే అతి పొడవైన హైడ్రాలిక్ టన్నెల్(సొరంగం) నిర్మాణ పనులు శరవేగంగా చేపడుతున్నారు. ములుగు జిల్లా రామప్ప నుంచి వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవన్నపేట వరకు సాగే ఈ సొరంగం పొడవు 49 కిలోమీటర్లు. ఇప్పటికే 44.7 కిలోమీటర్ల సొరంగం పూర్తయింది. దేవన్నపేట వద్ద నిర్మిస్తున్న సర్జ్పూల్, పంప్హౌజ్ సైతం ఆసియాలోనే అతిలోతైనవి కావడం మరో రికార్డు. 143 మీటర్ల లోతులో వీటిని నిర్మిస్తున్నారు. ఆసియాలోని సొరంగమార్గాల్లో బస్వేలు, రైల్వేలున్నా నీటిని తరలించేందుకు దేవాదులకు మించిన పొడవైన సొరంగమార్గం మరెక్కడా లేదని నీటిపారుదలశాఖ అధికారులు అంటున్నారు. దేవాదుల మూడోదశ పనుల్లో ప్రధానమైన సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు.
ములుగు, వరంగల్రూర ల్, వరంగల్ అర్బన్ జిల్లాల గుండా (రామప్ప, బండారుపల్లి, ఇంచెం చెరువుపల్లి, అబ్బాపూర్, గోరికొత్తపల్లి, వసంతాపూర్, మాందారిపేట, మైలా రం, ల్యాదెళ్ల, సిద్దాపూర్, పెగడపల్లి, భీమారం, దేవన్నపేట) ధర్మసాగర్ రిజర్వాయర్ వరకు ఈ సొరంగం వెళ్తుంది. రామప్ప నుంచి దేవన్నపేట వరకు 49.06 కిలోమీటర్లు. రామప్ప వద్ద భూ ఉపరితలం నుంచి త క్కువ లోతులో ప్రారంభమై హసన్పర్తి మండలం భీమారం వద్ద 114 మీటర్ల లోతు నుంచి సొరంగం తవ్వుతున్నారు. అది ధర్మసాగర్ వరకు 165 మీటర్లకు చేరుతుంది. అలాగే.. దేవాదుల మూడోదశ పనుల్లో నిర్మించే సర్జ్పూల్, పంప్హౌజ్లది కూడా రికార్డే. ఆసియాలోనే ఇంతలోతైన సర్జ్పూల్, పంప్హౌజ్లు మరెక్కడా లేవని అధికారులు అంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద ఉన్న సర్జ్పూల్ (మహా బావి) 92 మీటర్ల లోతు ఉండగా, దేవాదులలో భాగంగా దేవన్నపేటలో నిర్మిస్తున్న పంప్హౌజ్ దాదాపు 26 మీటర్ల విస్తీర్ణంతో 143 మీటర్ల లోతు, సర్జ్పూల్ను 137 మీటర్ల లోతుతో నిర్మిస్తున్నారు.