ట్యాక్స్ పేయర్స్ కి తీపికబురు అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడువును పొడిగించింది. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ కిగాను.. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది ఆదాయపు పన్ను శాఖ. కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో పన్ను చెల్లింపుదారులకు మరో ఊరట కల్పించింది ఆదాయపు పన్ను శాఖ. ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్ గడువును పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైలింగుల గడువును ఈ ఏడాది నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.
ప్రస్తుత కష్టసమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు సహాయపడుతుందని పేర్కొంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలును జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలుకు నవంబర్ 30వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పాన్ కార్డు - ఆధార్ కార్డు అనుసంధానం గడువును కూడా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. అలాగే పన్ను ఆడిట్ రిపోర్ట్ నివేదిక గడువు అక్టోబర్ 31కి పొడిగించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి టీడీఎస్, టీసీఎస్ సర్టిఫికెట్స్ జారీని జూలై 31, ఆగస్ట్ 15 కి పొడిగించింది ఆదాయపు పన్ను శాఖ. మొత్తానికి పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడువును పెంచి ప్రస్తుత పరిస్థితుల్లో ఉపశమనం కలిగించింది. విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పన్ను చెల్లింపుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.