రాజకీయ నాయకుల లక్ష్యం సాధారణంగా పదవుల మీదే ఉంటుంది. వాస్తవానికి పదవి ఉంటేనే కదా మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత తరం నాయకులకు పదవి సేవ కోసం కాకపోయినా ఆ హోదాయే వేరు. అందుకే ఎమ్మెల్యే గా గెలిచిన ప్రతి ఒక్కరూ మంత్రి పదవి కోసం ఆశపడతారు. అది పెద్ద తప్పేమీ కాదు..
కానీ రాజకీయాల్లో కృషి, పట్టుదలతో పాటు అదృష్టం కూడా కలసి రావాలి. ఎందుకంటే.. ఎందరో నాయకులు ఎమ్మెల్యేలుగా ఎన్నిసార్లు ఎన్నికైనా.. అనేక సమీకరణాల కారణంగా మంత్రి పదవిని అందుకోలేకపోతుంటారు. అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. కేవలం ప్రజాబలం, విశ్వాసం, సీఎం అనుగ్రహం ఉన్నంత మాత్రాన మంత్రులు కాలేరు.

ఇందుకు తాజా ఉదాహరణ.. ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ.. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం శంకరగుప్తం శివారు అడవి పాలెంలో జన్మించిన చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 2001లో రాజోలు జెడ్పీటీసీ సభ్యునిగా గెలిచి జిల్లా పరిషత్ అధ్యక్షుడు అయ్యారు.

ఆ తర్వాత 2014లో వైయస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. తిరిగి 2019లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అనొచ్చని మురిసిపోతుంటే ఇప్పుడు అనూహ్యంగా మంత్రి పదవి కూడా వరించేసింది. అందుకే రాజకీయాల్లో అదృష్టం కూడా కలసిరావాలని అంటుంటారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి