వెయ్యి కోట్ల రూపాయల హవాలా కేసుకు సంబంధించి చైనా జాతీయుడు
చార్లీ పెంగ్, మరి కొందరిపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారంనాడు కేసు నమోదు చేసింది. 2018వ సంవత్సరం
సెప్టెంబర్ 13వ తారీఖున
ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్, హవాలా సంబంధిత అంశాలపై ఐటీ శాఖ ఇప్పటికే
చార్లీ పెంగ్ను విచారిస్తోంది. గతంలో టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామాపై
చార్లీ పెంగ్ గూఢచర్యం నెరపాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీలోని మజ్ను-కా-టిల్లా ఏరియా నుంచి అతన్ని పట్టుకుని, ఫోర్జరీ అండ్ పాస్పోర్ట్ యాక్ట్ కింద గతంలో అరెస్టు చేశారు.
గౌహతి పాస్ పోర్ట్ ఆఫీసు నుంచి మణిపూర్ అడ్రెస్తో జారీ అయిన నకిలీ పాస్పోర్టును సైతం అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతన్ని బెయిలుపై విడుదల చేశారు. 2019వ సంవత్సరం జూన్ 6వ తారీఖున
చార్లీ పెంగ్ పై పోలీసులు చార్జిషీటు నమోదు చేశారు.
కాగా, ఈ ఏడాది 2020, ఆగస్టు 11వ తారీఖున చార్లీ పెంగ్, అతనితో కుమ్మక్కయిన బ్యాంకర్లు, సీఏల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపి, వెయ్యి కోట్ల హవాలా సొమ్మును కనుగొంది. చార్లీ పెంగ్ మరికొందరు చైనీయులు కలిసి బ్యాంకు అధికారులు, సీఏల సహకారంతో సుమారు నలభై నకిలీ అకౌంట్లు తెరచి, షెల్ కంపెనీలు కూడా ఆపరేట్ చేసి, వందల కోట్ల రూపాయలు వాటి ద్వారా కాజేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు.