కాగా తాజా సమాచారం ప్రకారం పార్లమెంట్ క్యాంటీన్లో లభించే ఆహార పదార్ధాల ధరలు భారీగా పెరగనున్నాయట...! దీనికి కారణం చూస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తూ వస్తున్న ఆహార రాయితీని ఎత్తివేయనున్నట్లు తెలిసింది. నిన్న అనగా మంగళవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా జారీ చేశారు. అంతే కాకుండా ఇప్పటి వరకు క్యాంటీన్ నిర్వహిస్తున్న నార్తర్న్ రైల్వేస్ (ఉత్తర రైల్వే)ను తప్పించి.. ITDC (ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్)కు అప్పగించారు. ఇంతకు ముందు ఇస్తున్న రాయితీ ప్రకారం పార్లమెంట్ సిబ్బంది మరియు ఎంపీలకు ఆహారపదార్ధాలపై 80 శాతం వరకు ఉంది.
ఈ విధంగా రాయితీ ద్వారా అయ్యే ఖర్చు సంవత్సరానికి 17 కోట్ల రూపాయలు అవుతుండగా, వీటిలో దాదాపు 14 కోట్లను సందర్శకులు మరియు పార్లమెంట్ సిబ్బంది మాత్రమే ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. ఖచ్చితంగా ఉపయోగించుకోవలసిన ఎంపీలు మాత్రం చాలా తక్కువగా వినియోగించుకుంటున్నారు. కోట్లకు కోట్లు ఆస్తులుండే ఎంపీలకు ఆహార రాయితీ ఇవ్వడం వలన ప్రభుత్వానికి నష్టం వస్తున్నదని గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. అందువలన ప్రస్తుతం పార్లమెంట్ లో ఆహార పదార్ధాలపై రాయితీని ఎత్తి వేశారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నుండి ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి.