వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపులకు చంద్రబాబునాయుడు షాక్ ఇవ్వటం కాదు, అసలు ఫిరాయింపు నియోజకవర్గాలే చంద్రబాబుకు రివర్స్ లో షాక్ ఇస్తాయా అన్న అనుమానం వస్తోంది. గడచిన నాలుగేళ్ళల్లో వైసిపి తరపున గెలిచిన 27 మంది ప్రజా ప్రతినిధులను చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ముగ్గురు ఎంపిలుండగా మిగిలిన 24 మంది ఎంఎల్ఏలు. వీరందరూ వైసిపిలో ఉన్నంత వరకూ బాగానే ఉన్నారు. ఎప్పుడైతే టిడిపిలోకి ఫిరాయించారో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫిరాయింపుల్లో అత్యధికులు తమ నియోజకవర్గాల్లో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మళ్ళీ వీళ్ళల్లో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారులేండి.
ఫిరాయింపులపై తీవ్ర వ్యతిరేకత
జనాల్లో వీళ్ళపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎప్పటికప్పుడు అన్నీ నియోజకవర్గాలతో పాటు ఫిరాయింపు నియోజకవర్గాల్లో కూడా సర్వేలు చేయిస్తున్నారు. ఎన్ని సర్వేలు చేయించినా ఫిరాయింపులపై వ్యతిరేకత పెరుగుతోందే కానీ తగ్గటం లేదని చంద్రబాబుకు స్సష్టమైపోయింది. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో ముత్తమూల అశొక్, తూర్పు గోదావరి జిల్లాలోని చోడవరంలో వంతల రాజేశ్వరి, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ, విశాఖపట్నం జిల్లా పాడేరులో గిడ్డి ఈశ్వరి, కర్నూలు జిల్లా నంద్యాలలో మంత్రి భూమా అఖిలప్రియ, కోడుమూరులో మణిగాంధి, కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డితో పాటు బద్వేలు నియోజకవర్గంలో జయరాములు లాంటి వాళ్ళపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నది వాస్తవం.
ఫిరాయింపులకు మొండి చెయ్యేనా ?
పార్టీ వర్గాల ద్వారానే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్టుల్లో కూడా ఫిరాయింపుల్లో వ్యతిరేకత ఉందని తేలటంతో చాలా మందికి టిక్కెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారట. అంటే మెజారిటీ ఎంఎల్ఏలకు టిక్కెట్ల కేటాయింపులో చంద్రబాబు షాక్ ఇవ్వటం ఖాయంగా తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు ఫిరాయింపుల్లో అత్యధికులకు షాక్ ఇవ్వటమన్నది ఒకవైపు నాణెం మాత్రమే అని తెలుస్తోంది. నాణేనికి రెండో వైపు ఏంటంటే ఫిరాయింపు నియోజకవర్గాలే చంద్రబాబుకు షాక్ ఇస్తాయట.
ఫిరాయింపు నియోజకవర్గాల్లో పరిస్దితేంటి ?
ఎలాగంటే, ప్రలోభాలకు గురిచేసి వైసిపి ఎంఎల్ఏలను చంద్రబాబు టిడిపిలోకి లాక్కోవటాన్ని జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అంటే, ఫిరాయించటం ఎంఎల్ఏల తప్పయితే, ప్రలోభాలకు గురిచేయటం చంద్రబాబు తప్పని జనాలు అభిప్రాయపడుతున్నారు. 2014లో ఫిరాయింపు నియోజకవర్గాల్లో జనాలు వైసిపి అభ్యర్ధులను గెలిపించిందెందుకు ? టడిపి కి వ్యతిరేకంగానే కదా ? అటువంటిది గెలిచిన వాళ్ళను చంద్రబాబు టిడిపిలోకి లాక్కోవటమేంటి ?
ఫలితంలో తేడా ఉండదా ?
అంటే, పార్టీపై వ్యతిరేకతతో పాటు చంద్రబాబు మీద వ్యతిరేకత కూడా తోడైందన్న మాట. వీటన్నింటికి అదనంగా నాలుగేళ్ళ పాలనలో ప్రభుత్వంపై పెరిగిపోయిన వ్యతిరేకత బోనస్. సో, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఫిరాయింపులకు టిక్కెట్లు ఇచ్చినా, ఒకవేళ మార్చి కొత్తవారికిచ్చినా రిజల్ట్ అయితే ఒకటేనట. చూడబోతే చంద్రబాబు కాదు షాకిచ్చేది. ఫిరాయింపు నియోజకవర్గాలే చంద్రబాబుకు షాకిచ్చేట్లుగా ఉంది. ఏమంటారు ? ఎనీ డౌట్ ?