ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది వైసిపి పార్టీ మరియు టిడిపి పార్టీ ల మధ్య పోటీ తీవ్రంగా మారింది...నేతల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఆంధ్ర రాజకీయ ముఖచిత్రం గమనిస్తే గత ఎన్నికల మాదిరిగానే వైసిపి మరియు టిడిపి పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి.
ఒక పక్క రాష్ట్రంలో జరుగుతున్న సర్వేలలో వైసిపి పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఫలితాలు వస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వైసీపీ పార్టీ లోకి రావడంతో టిడిపి అధినాయకుల లో టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉండగా ఇటీవల బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏవో జిమ్మిక్కులు చేస్తారని, ఆ పార్టీ నేతలే అంటున్నారని వైఎస్సార్సీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.
బుధవారం వైఎస్సార్సీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిమ్మిక్కులు చేశారన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ అంటే టిడిపి ఉద్దేశంలో అకౌంట్స్ ఫర్ ఓట్స్గానే చూస్తున్నారన్నారు.
ఓట్ల కోసమే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారే తప్ప, చిత్త శుద్దితో కాదన్నారు. ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని నెరవేర్చారో చంద్రబాబు చెప్పాలి. దివంగత నేత ఎన్టిఆర్ బతికుంటే తమ పార్టీకే మద్దతు తెలిపేవారన్నారు. ఎన్టిఆర్ బతికి ఉన్నంత కాలం టిడిపి పద్దతిగా ఉందని, ఇప్పుడు ఆయన సిద్దాంతాలకు పూర్తి వ్యతిరేకంగా మారిందని విమర్శించారు.