ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలు ఎలా ? ఉంటాయా అన్న అంశంపైనే ఉంది. పోలింగ్ తేదీకి, ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఏకంగా 43 రోజుల సమయం ఉండడంతో ఎవరికి వారు తమకు అనుకూలంగా అంచనాల్లో మునిగిపోయారు. పోలింగ్ సరళిని బట్టీ చూస్తే వైసీపీకి ఎడ్జ్ ఉందన్న విషయాన్ని అటు జాతీయ మీడియాతో పాటు ఇటు పలు స్థానిక సర్వేలు, రాజకీయ విశ్లేషకులు, న్యూట్రల్ ఓటర్లు అంగీకరిస్తున్న విషయం. ఇక వాస్తవంగా చూస్తే కూడా కొన్ని సామాజికవర్గాలు వైసీపీకి గంపగుత్తుగా ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. రెడ్డి సామాజికవర్గం ఈ సారి ఎలాగైనా తన సామాజికవర్గానికి చెందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వాలన్న కసితో ఫ్యాన్కు ఓట్లు వేశారు. వాస్తవంగా చూస్తే ఒకప్పుడు తెలుగు రాజకీయాలను తమ కనుసైగలతో శాసించిన రెడ్డి సామాజికవర్గం రాష్ట్ర విభజనతో అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ డీలా పడింది.
2014 ఎన్నికల్లో తెలంగాణలో వెలమ సామాజికవర్గానికి చెందిన కేసీఆర్ సీఎం అయితే, ఏపీలో కమ్మ సామాజికవర్గానికి చెందిన చంద్రబాబు సీఎం అవ్వడంతో రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయి. 2014 తర్వాత వరుస ఎదురు దెబ్బలతో రెడ్లు రాజకీయంగా వెనకపడిపోయారు. ఇక తెలంగాణలో మరో సారి కేసీఆర్ సీఎం అవ్వడంతో రెడ్లు అంతా కేసీఆర్ కనుసన్నంలోనే పని చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చినా అంతిమంగా ముఖ్య మంత్రి ఆ సామాజికవర్గానికి చెందిన వారు అయితే కాదు కదా...! ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సామాజికవర్గానికి చెందిన వాడే ముఖ్య మంత్రి కావాలని రెడ్లు వన్ సైడ్గా వైసీపీకి ఓట్లు వేశారు. ఇక మిగిలిన సామాజికవర్గాల్లో ఎస్సీలు, క్రైస్తవులు ముందు నుంచి కాంగ్రెస్కు ఆ తర్వాత వైఎస్ సీఎం అయ్యాక వైఎస్కు అభిమానులుగా మారారు. ఇప్పుడు అదే ఓటు బ్యాంకు ఇటు జగన్కు కూడా టర్న్ అయ్యింది.
ఈ ఎన్నికల్లో ఎస్సీల్లో మాల సామాజికవర్గం చాలా వరకు జగన్ వైపే ఉందని స్పష్టంగా తేలిపోయింది. ప్రత్యేకించి క్రైస్తవులతో పాటు మాదిగ సామాజికవర్గంలో కూడా ఎక్కువ మంది జగన్కు మద్దతు పలికారు. ప్రతీ నియోజకవర్గంలోనూ భారీగా ఉన్న ఎస్సీ వర్గం ఓటర్లు, క్రీస్టియన్లు దాదాపు వన్ సైడ్గానే జగన్ వైపు ఉన్నట్టు తేలిపోయింది. ఇక బ్రాహ్మణ సామాజికవర్గం మొత్తం జగన్ వైపే ఉంది. ఈ ఎన్నికల్లో జగన్ ఈ సామాజికవర్గానికి ఎవ్వరూ ఊహించని విధంగా 4 సీట్లు ఇచ్చారు. అదే టీడీపీ అధినేత బ్రాహ్మణులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.
జగన్ విశాఖ దక్షిణంలో ద్రోణంరాజు శ్రీనివాస్, విశాఖ తూర్పులో అక్కరమాని విజయనిర్మల, విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణు, బాపట్లలో కోణ రఘుపతికి ఛాన్స్ ఇచ్చారు. ఇక గత పరిణామాలు కూడా కలుపుకుంటే బ్రాహ్మణ సామాజికవర్గం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేందుకు ఇష్టపడలేదు. ఇక పైన చెప్పుకున్న సామాజికవర్గాలతో పాటు మిగిలిన సామాజికవర్గాలు సైతం జగన్ వైపు మొగ్గు చూపినా ప్రత్యేకించి ఈ సామాజికవర్గాలు జగన్కు ఏకపక్షంగా ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. రేపు ఎన్నికల ఫలితాల్లో కూడా ఇది బాగా వర్కోట్ అయ్యి వైసీపీ సానుకూల ఫలితాలు వచ్చేందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.