మొబైల్ వాడుతూ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్నాడు అంటే చాలు ఇక ఈ లోకాన్ని సైతం మరిచిపోతూ ఎక్కడికి వెళుతున్నామో.. ఏం చేస్తున్నామో కూడా తెలియనంత విచక్షణారహితంగా మనిషి ప్రవర్తన తీరు మారిపోయింది. ఇక ఇలాంటి ప్రవర్తనే చివరికి ప్రాణాల మీదికి తెస్తుంది. ఎంతోమంది రైలు పట్టాలపై నడుస్తూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చివరికి ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇలాంటి రైలు ప్రమాదాలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇయర్ ఫోన్స్ మరో ప్రాణం పోవడానికి కారణం అయ్యాయి.
చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటడానికి ప్రయత్నించాడు యువకుడు. కానీ మరోవైపు నుంచి రైలు దూసుకు వస్తుంది అన్న విషయం అతనికి అర్థం కాలేదు. గమనించిన లోకో పైలట్ హారన్ కొట్టిన అతనికి ఇయర్ ఫోన్స్ చెవిలో ఉండడంతో సౌండ్ వినిపించలేదు. దీంతో రైలు ఢీకొని చివరికి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. ఇటీవల ఓ వ్యక్తి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పట్టాలు దాటుతుండగా.. అదే సమయంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ అతన్ని ఢీకొట్టింది. ఇక అతని శరీరం చింద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనఫై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.