తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా దృష్ట్యా తగు జాగ్రత్తలతో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు..
డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తరగతుల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి, జేఎన్టీయూ దృష్టి సారించాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ
ఫిబ్రవరి1వ తేదీ నుంచి 9, 10, ఆపై తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్దం చేస్తున్నారు.
ప్రత్యక్ష విద్యా బోధన పై విద్యామండలి ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది.మరోవైపు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రత్యక్ష బోధనకు జేఎన్టీయూ ఏర్పాట్లు చేస్తోంది.తెలంగాణలో వెయ్యి కి పైగా కాలేజీలు ఉండగా అందులో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు
డిగ్రీ చదువుతున్నారు.ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు 4.65 లక్షల మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులు 2.35 లక్షల మంది ఉన్నారు. వారందరికీ ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది.
కాగా, ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా శానిటైజేషన్ వంటి కోవిడ్ నిబంధనలను పాటించడం, భౌతిక దూరం నిబంధనను అమలు చేయాల్సి ఉంది. అందుకే ప్రత్యక్ష పద్దతిలో క్లాసులు ప్రారంభించాలని నిర్ణయించారు.బీఎస్సీ, బీబీఏ, వొకేషనల్, ఇతర కోర్సుల వారికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రత్యక్ష బోధన అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఉన్నత విద్యా మండలి ఆలోచిస్తుంది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తరగతుల నిర్వహణపై జేఎన్టీయూ కసరత్తు ప్రారంభించింది.
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముందుగా బీటెక్ తృతీయ, నాలుగో సంవత్సరాల తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందించారు.
ఫిబ్రవరి 1వ తేదీన ప్రత్యక్ష విద్యా బోధనకు హాజరయ్యే విద్యార్థులు
ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులను వింటారని,
ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థులు
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో తరగతులు వినేలా అన్నీ కసరత్తులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కరోనా భయం పోతుందని అంటున్నారు. తల్లి దండ్రులు ఎటువంటి భయం లేకుండా కాలేజీలకు పంపవచ్చునని అధికారులు వెల్లడించారు..