తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు చిత్రాలంటే మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రిన్స్ మహేష్ బాబు అంటే ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు..అతడు, ఒక్కడు, పోకిరి, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఇక కోరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ అద్భుతమైన మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. అంతే కాదు మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.
ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్ కాగా, మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ తో అద్భుత విజయం సాధించారు. పొలిటికల్ డ్రామాగా సాగిన ఈ చిత్రంలో మహేష్ సిఎం గా అదరగొట్టారని టాలీవుడ్ సెలబ్రెటీలు తెగ మెచ్చుకుంటున్నారు. భరత అనే నేరు విజయ పరంపర కొనసాగుతుంది..ఈ నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని సినీ హీరో మహేష్ బాబు దర్శించుకున్నారు.
ఆయనతో పాటు ఆయన బావ, ఎంపీ గల్లా జయదేవ్, దర్శకుడు కొరటాల శివ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా సినీ అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు వచ్చారు. ప్రస్తుతం ఈ రీల్ లైఫ్ సీఎం.. ఎందరో రియల్ లైఫ్ సీఎంలకు ఆదర్శంగా మారిపోయారు. సొసైటీ అంటే అందరికీ భయం, బాధ్యత ఉండాలంటూ సామాజిక బాధ్యతను గుర్తిచేసిన సీఎం సార్కి సాహో అంటున్నారు ప్రేక్షకులు.
ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ ‘భరత్ అనే నేను’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో విజయోత్సవ సంబరాల్లో ఉంది చిత్రయూనిట్. అమ్మవారి దర్శనానంతరం వీరంతా గవర్నర్ పేటలోని అన్నపూర్ణ థియేటర్ కు వెళ్లారు. అభిమానులతో కలసి వీరు 'భరత్ అనే నేను' సినిమా చూడనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బెంజిసర్కిల్ లోని ట్రెండ్ సెట్ మాల్ లో అభిమానులను మహేష్ కలుసుకున్నారు.