ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిని చేయబోతోంది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు చిత్తుగా ఓడిందో ఇప్పటికే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. మరి బీజేపీ ఎందుకు ఓడింది ? ఎక్కడ వెనకపడింది ? 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఉన్న ఏడు ఎంపీ సీట్లను క్వీన్స్వీప్ చేసిన బీజేపీ.. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో కూడా అనేక రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపింది. ఇక అమిత్ షా అయితే ఏకంగా 50 రోడ్ షోలలో పాల్గొనడంతో పాటు ఇంటింటికి తిరిగి కేజ్రీవాల్ను తిడుతూ మరీ ప్రచారం చేశారు.
ఇక అటు ఆప్ బీజేపీకి ధీటుగా ప్రచారం చేస్తూ అందరిని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎన్నికల ప్రచారంలో మొదటి నుంచీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి అర్వింద్ కేజ్రీవాల్...మరి మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ ఆప్ పదేపదే ప్రశ్నించింది. కేజ్రీవాల్కు పోటీగా ఓ బలమైన బీజేపీ నాయకుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించలేకపోవడంతో ఎన్నికలకు ముందే ఆ పార్టీ చేతులు ఎత్తేసినట్లయ్యింది. అలాగే బీజేపీ ఐదేళ్లు కేజ్రీవాల్ను ప్రశాంతంగా పరిపాలన చేయనీయలేదు.. తమ అనుకూల మీడియా ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రికి అధికారాలు లేవు..ఓ నగర మేయర్కు ఉన్న అధికారాలే ఉంటాయన్న ప్రచారం చేయించింది.
ఇక పీకే వ్యూహాలు... అరవింద్ కేజ్రీవాల్ జాతీయ పౌరసత్వ సవరణ విషయంలో వ్యవహరించిన తీరు... అల్లర్ల విషయంలో సైలెంట్గా ఉండడం ఆయనకు కలిసి వచ్చాయి. ఇక ఎన్నికల ప్రచారాన్ని స్థానిక అంశాల నుంచి జాతీయత వైపునకు మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇది కూడా ఎన్నికల్లో బీజేపీ నష్టపోవడానికి కారణమయ్యిందని చెబుతున్నారు. ఇక ఐదేళ్లలో కేజ్రీ వాల్ సర్కార్ ఢిల్లీలో మంచి నీళ్లు, ప్రభుత్వ విద్య, ప్రజా ఆరోగ్యం తదితర రంగాల్లో మంచి పాలన అందించింది. ఇక కేజ్రీవాల్ దేశంలోనే ఉన్న ఏకైక ఉత్తమమైన, నిజాయితీ పరుడు అయిన సీఎం కావడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. ఇవన్నీ ఢిల్లీలో బీజేపీని చిత్తుగా ఓడించాయి.