ఆ ఊరిలో సర్పంచ్ పదవి జనరల్ మహిళలకు కేటాయించారు. కొత్తగా ఇంటికి వచ్చిన కోడలికి ఆ పదవి ఇవ్వాలని ఓ కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఊరి ప్రజల్నీ ఒప్పించింది. ఏకగ్రీవంకోసం భారీగానే ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. తీరా నామినేషన్ వేసే సమయానికి అసలు విషయం బయటపడింది. 2019 ఓటర్ల లిస్ట్ ప్రకారం జాబితాలో కోడలి పేరు లేదు. ఓటు హక్కు లేకుండా అదే గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం కుదరదు. దీంతో ఆ కొత్త కోడలు సర్పంచ్ అవకాశం కోల్పోయింది.

అయితే కోడలికి దక్కాల్సిన సర్పంచ్ యోగం.. అనూహ్యంగా అత్తని వరించింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం కోలగట్ల పంచాయతీ ఎన్నికల రంగంలో జరిగింది. కోలగట్ల పంచాయతీ సర్పంచ్ పదవిని వైసీపీ మద్దతుదారుడు చేవూరు శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి ఏకగ్రీవం చేశారు గ్రామస్తులు. ఈ స్థానం జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వ్ కావడంతో కుటుంబంలోని మహిళను సర్పంచ్ గా చేద్దామనుకున్నారు. శ్రీనివాసులరెడ్డి కోడలు పి.చిన్మయి విద్యావంతురాలు కావడంతో.. ఆమె ఆధ్వర్యంలో గ్రామం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆమెను ఏకగ్రీవం చేద్దామనుకున్నారు. అందరూ ఇదే నిర్ణయం తీసుకుని నామినేషన్ కు సిద్ధమయ్యారు. అయితే ఓటర్ లిస్ట్ లో చిన్మయి పేరు లేకపోవడంతో ఆఖరు నిముషంలో మరో నిర్ణయం తీసుకున్నారు. కోడలు చిన్మయి బదులు ఆమె అత్త, శ్రీనివాసులురెడ్డి సతీమణి విజయలక్ష్మితో నామినేషన్‌ వేయించారు. కోలగట్లలో ఒకే నామినేషన్‌ పడటంతో సర్పంచి స్థానం ఏకగ్రీవం కాబోతోంది.

ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నాలుగు దశల్లో 935 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. తొలి దశ నామినేషన్లు తీసుకున్న కావలి డివిజన్ లో ఈనెల 9న పోలింగ్‌ నిర్వహణకు సిద్ధంగా ఉన్నారు అధికారులు.  రెండో దశలో ఉన్న ఆత్మకూరు డివిజన్‌లోనూ పోలింగ్‌ కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. మూడో దశలోని గూడూరు, నాయుడుపేటకు నామినేషన్‌ లు తీసుకుంటున్నారు. నాలుగో దశకు కూడా సర్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: