ఏ ముహూర్తంలో తెలంగాణా రాష్ట్ర సమితి చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందస్తు టిక్కెట్లను ప్రకటించారో కానీ అప్పటి నుండి పార్టీలో ఊహించని ట్విస్టులు ఎదురవుతునే ఉన్నాయి. ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీని రద్దు చేసుకున్నపుడే పార్టీలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, తొమ్మిది నెలల ముందుగా ఎంఎల్ఏ పదవులను వదులు కోవటానికి చాలా మంది ఎంఎల్ఏలు సిద్ధంగా లేరట. కానీ కెసిఆర్ కు ఎదురుచెప్పే సాహసం చేయలేకపోయారు.
ముందస్తు ఎన్నికలపై కెసిఆర్ ముందే నిర్ణయం తీసేసుకుని తర్వాత ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు అడిగారు కాబట్టి ఎవ్వరూ వ్యతిరేకంగా నోరెత్తే సాహసం చేయలేదు. దాంతో ధైర్యంగా అసెంబ్లీ రద్దుకు కెసిఆర్ నిర్ణయం తీసేసుకున్నారు. ఎప్పుడైతే అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేశారో అప్పటి నుండే టిఆర్ఎస్ లో నాటకీయ పరిణామాలు మొదలయ్యాయి.
తనమాటకు ఎవరూ ఎదురుచెప్పే వారే లేరనుకున్న కెసిఆర్ ఒకేసారి 105 మందికి టిక్కెట్లను ప్రకటించేశారు. వివిధ కారణాలు చెప్పి కొందరికి టిక్కెట్లు ఇవ్వలేదు. పార్టీలోకి చేర్చుకునేటపుడు చాలామంది నేతలకు టిక్కెట్ల హామీనిచ్చి పార్టీలోకి చేర్చుకున్నారట. అటువంటి వారిలో అత్యధికులకు టిక్కెట్లు దక్కలేదు. అసలే పదవులు వదులుకోవటాన్ని ఇష్టపడని వారిలో తిరిగి టిక్కెట్లు దక్కని వారు కొందరున్నారు. హామీ మేరకు టిక్కెట్లు లభించని వారు మరికొందరున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించకూడదంటూ కొందరు తాజా మాజీలకు వ్యతిరేకంగా కొన్ని నియోజకవర్గాల్లోని నేతలు కెసిఆర్ కు ఫిర్యాదు చేశారు. అయినా వారి అభ్యంతరాలను కాదని కెసిఆర్ వారికే టిక్కెట్లిచ్చారు. వారు, వీరు అంతా కలిసి టిఆర్ఎస్ లో తిరుగుబాట్లు లేవదీస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తాజా మాజీ ఎంఎల్ఏ నల్లాల ఓదేలు-ఎంపి బాల్క సుమన్ గొడవ ఇందులో భాగమే. అలాగే, రామగుండం, వేములవాడలో తాజా మాజీలకు టిక్కెట్లివ్వద్దని చెప్పినా వారికే కెసిఆర్ టిక్కెట్లు కేటాయించటంతో వారిపై అక్కడి నేతలు బహిరంగంగానే తిరుగుబాటు చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ కూడా బహిరంగంగానే కెటిఆర్ పై ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రోజురోజుకు తిరుగుబాట్లు పెరుగుతున్నాయే కానీ ఏమాత్రం తగ్గటం లేదు. పైగా ఇపుడు టిక్కెట్లు ప్రకటించిన 105 మందిలో కూడా కనీసం 30 మందిని మార్చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే అప్పుడు ఇంకెన్ని గొడవలు మొదలవుతాయో చూడాల్సిందే.
నేతల నుండి ఈ స్ధాయిలో తిరుగుబాట్లను కెసిఆర్ ఏమాత్రం ఊహించలేదు. ఎక్కడో ఒకటో అరో వ్యతిరేకత ఉంటుందని అనుకుని ఉంటారు. అంతే కానీ నియోజకవర్గాలకు నియోజకవర్గాల్లోనే గొడవలు రోడ్డున పడతాయని ఊహించకపోవటంతో షాక్ తిన్నారు. దానికితోడు తనపై తిరుగుబాట్లు చేస్తున్న వారిలో అత్యధికులు టిడిపి వైపో లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు సిద్దమవుతున్నారు. ఒకవైపు టిడిపి, కాంగ్రెస్ లు కలిసిపోవటం, అదే సమయంలో టిఆర్ఎస్ లోనే తిరుగుబాట్లు పెరిగిపోతుండటంతో కెసిఆర్ కు టెన్షన్ పెరిగిపోతోంది. మరీ ఈ సిట్యుయేషన్ నుండి ఎలా బయటపడతారో చూడాల్సిందే.