ఎవరేమి అనుకున్నా తాను అనుకున్నదే చేస్తాను అన్న పంతం జగన్ ది. అంతేకాదు ఆ విధంగా అనుకుని కొన్ని పనులు చేసి విమర్శల పాలయ్యారాయన. అయినా కూడా ఆయన తగ్గడం లేదు. టీడీపీ హవాకు చెక్ పెట్టి బలమయిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీకి ఇకపై కూడా రాజకీయం అలానే ఉంటుందన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అందుకే తీసుకుంటున్న నిర్ణయాలు పునరాలోచన చేయకుండా ఉంటోంది. కొన్ని సార్లు కొన్ని నిర్ణయాలు వెనక్కు తీసుకుని డైలామా నుంచి ఒడ్డెక్కుతోంది. రాజధాని విషయమై కూడా ఇలానే జరిగింది. మొదట 3 రాజధానులు అంటూ హడావుడి చేసి తరువాత వెనక్కు తగ్గింది. 3 రాజధానుల బిల్లు రద్దు చేసుకుని అసెంబ్లీ వేదికగా ఓ నిర్ణయం వెలువరించి నవ్వుల పాలయింది. ఇక రాజధానిని అమరావతి గా చేసేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలూ అలానే ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా రాజధాని రైతుకు అండగా ఉండాలన్నది టీడీపీ నిర్ణయం. అందుకే రైతుల పాదయాత్రకు ఎన్నో అవాంతరాలు వచ్చినా అండగానే ఉంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయి.. వైసీపీకి ఎన్ని ఓట్లు వస్తాయి?
వాస్తవానికి రాజధాని ఎటు ఉన్నా కూడా ఎవరివైపు నిర్ణయం ఉన్నా కూడా ప్రజలందరికీ రాజధాని అన్న భావన అందరిలోనూ రావాలి. అయితే ఆ రోజు రాజధాని అమరావతి అని చెప్పాక టీడీపీ మాట్లాడిన మాటలు విని వైసీపీ ఏమీ అనలేదు. ఇప్పుడు ఈ నగర అభివృద్ధికి లక్ష కోట్లు తాము తీసుకుని రాలేమని చెబుతోంది. దీంతో ఆ రోజు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇక చాలా మంది రోడ్డున పడ్డారు. అయినా వైసీపీ మాత్రం విశాఖపై ప్రేమ పెంచుకుంటోంది. ఓటు విషయమై వస్తే రాజధాని నిర్ణయం కారణంగా రోడ్డున పడ్డ కుటుంబాలకు యావత్ ఆంధ్రులు అండగా ఉంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది. చంద్రబాబు చాణక్యం కారణంగానే రాజధాని అమరావతిగా ప్రకటితం అయిందని వైసీపీ చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారా లేదా అన్నది కూడా కొంచెం ఆలోచించాల్సిందే!
రాజధాని ఓటు వైసీపీకి కాకుండా టీడీపీకే పడితే వచ్చే సారి చంద్రబాబు అనుకున్న కలలు అన్నీ నెరవేరుతాయి. విశాఖ కేంద్రంగా భూ కబ్జాలపై టీడీపీ నిరూపణ రీతిలో మాట్లాడితే అప్పుడు విశాఖ రాజధాని అనే మాట వినిపించడం వైసీపీ తగ్గుతుంది. ఇవేవీ చేయకుండా టీడీపీ రాజధాని అమరావతినే ఉంచాలని అంటే అప్పుడు ప్రజా మద్దతు కూడగట్టడం కష్టం. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయిందన్న భావన టీడీపీకి ఉంటే వైసీపీ వైఫల్యాలపై మాట్లాడాలి.. కానీ ఆ మాట మరిచి రాజకీయం చేస్తుంది. అదే ఇవాళ్టి చిక్కు.