ఇంటర్నెట్ డెస్క్: కొన్ని దేశాల సరిహద్దుల్లో సైన్యాలు పహారా కాస్తూ ఉంటాయి. అనుక్షణం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ యుద్ధ వాతావరణం ఉంటుంది. కానీ కొన్ని దేశాల సరిహద్దులు మాత్రం విచిత్రంగా ఉంటాయి. అసలు అవి సరిహద్దులంటే ఎవరూ నమ్మలేనట్లుంటాయి. ఆ సరిహద్దులోనే కొందరు ప్రజలు కూడా జీవిస్తూ ఉంటాయి. అలాంటి ఓ సరిహద్దు ప్రాంతమే ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌, మయన్మార్ మధ్యలో ఉంది. ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌‌కు ఉత్తర భాగంలో మన్ జిల్లాలో లోంగ్వా అనే ఓ గ్రామం ఉంది.

ఆ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆ గ్రామం రెండు దేశాల సరిహద్దు మధ్యలో ఉంది. ఈ గ్రామం మధ్యలో నుంచి ఇరు దేశాల సరిహద్దు రేఖ వెళుతుంది. ఇక్కడి కొణ్యక్‌ గిరిజనులూ రెండు దేశాల పౌరసత్వం కలిగి ఉన్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ గ్రామ పెద్ద లోక్‌నంగ్‌ ఇళ్లు సరిగ్గా ఇరు దేశాల సరిహద్దు రేఖపై నిర్మించి ఉంది. ఈ ఇల్లు సగం ఇండియాలోనూ, మరో సగం మయన్మార్‌లోనూ ఉంది. అంటే ఆయన రోజూ భారత్‌లో భోజనం చేసి మయన్మార్‌లో నిద్రపోతాడు.

ఈ ఊళ్లోని యువకులు తమ దృష్టిలో భారత్‌కూ, మయన్మార్‌కీ తేడాలేదని వారు చెబుతుంటారు. అందుకే కొంతమంది భారత్‌లో వ్యాపారం చేస్తుంటే మరికొందరు మయన్మార్ సైన్యంలో ఉన్నారు. ఈ ఆదివాసీలను భారత్‌లోని అతి పురాతనమైన ‘హెడ్‌ హంటర్స్‌’గా చెబుతుంటారు. కొన్నేళ్ల కిందటి వరకూ శత్రువులుగా భావించే ఇతర గిరిజన తెగ ప్రజల తలలు నరికి తేవడం వీరి ఒకప్పటి సంప్రదాయం. అయితే 1960 తర్వాత క్రిస్టియానిటీ ప్రబలిన తరువాత వీరు క్రమేపీ అంతరించిపోయారు. అలా ఎవరు చేసినా ఏదో ఘనకార్యం అన్నట్లు గుర్తుగా ఆ వ్యక్తి ఒంటిమీద పచ్చబొట్టు వేయించుకుని భారీ సంబరాలు జరుపుకునేవారు.
 
ఈతరం అలా లేదు కానీ అక్కడి వృద్ధుల ఒంటిమీద కనిపించే పచ్చబొట్లు వాళ్లు ‘హెడ్‌ హంటర్స్‌’ అని ఇప్పటికీ గుర్తు చేస్తుంటాయి. భారత్‌, మయన్మార్‌ దేశాల్లోని గ్రామాల్లో కలిపి దాదాపు 20లక్షల మంది కొణ్యక్‌ గిరిజనులు ఉంటారు. ఈ ప్రాంతంలో ఇరు దేశాల సరిహద్దును ఓ పిల్లర్‌తో సూచించడం జరిగింది. ఇక్కడే అస్సాం రైఫిల్స్ క్యాంప్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: