ముస్లింలలో బహు భార్యత్వం సర్వ సాధారణం. అదేమంత తప్పేమి కాదని ముస్లీం చట్టాలు చెబుతున్నాయి. దీన్ని ఆసరగా చేసుకుని ముస్లీంలలో చాలా మంది ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహమాడుతుంటారు. అయినా మొదటి భార్య నుంచి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదనే చెప్పాలి. న్యాయ పరంగా కూడా ఇందుకు ఇబ్బందులు ఉండవు. దీంతో ముస్లీంలలో బహు భార్యత్వం అనేది తర తరాలుగా కొనసాగుతూ వస్తోంది.
బహు భార్యత్వం వల్ల మహిళలకు అన్యాయం జరుగుతోందని, గతంలో చాలా మంది ముస్లీం మహిళలు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా లేక పోలేదు. కానీ ఇదంతా చట్టపరంగానే ఉంటుందని ముస్లీం పెద్దలు చెబుతున్నారు. అయితే స్త్రీలు మాత్రం పురుషాధిక్యతతో తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బహు భార్యత్వం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై నిషేధం విధిస్తే అది అక్రమ సంబంధాలకు దారితీస్తుందని వాదిస్తోంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందు ఆ బోర్డు తన వాదనను వినిపించింది. సాంప్రదాయం ప్రకారం ‘తలాక్’ అంటూ మూడు సార్లు పలికితే... ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులిచ్చేసినట్లే. ఈ దురాచారంపై అదే సామాజిక వర్గానికి చెందిన షయారా భాను అనే మహిళ నేతృత్వంలో పలువురు మహిళలు న్యాయపోరాటం చేస్తున్నారు.
ఈ దురాచారాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ వారు సుప్రీం గడప తొక్కారు. దీనిపై జరిగిన విచారణ సందర్భంగా పర్సనల్ లా బోర్డు బహు భార్యత్వం ఉండాల్సిందేనని వాదించింది. ముస్లిం పురుషులు స్వీయ నియంత్రణలో మెరుగ్గా రాణిస్తారని, ఈ నేపథ్యంలో ‘ట్రిపుల్ తలాక్’ పెద్ద సమస్యేమీ కాదని ఆ సంస్థ తరఫు న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా ట్రిపుల్ తలాక్ కు చెక్ పెడితే... బహు భార్యత్వానికి ముప్పు వస్తుందని ఆ సంస్థ వితండ వాదన చేసింది. ఇక బహు భార్యత్వాన్ని నిషేధిస్తే... అక్రమ సంబంధాలకు అడ్డే లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ దీనిపై మహిళలు మండిపడుతున్నారు. ఈ సాంప్రదాయానికి చరమగీతం పాడాలని, తమ హక్కులను కాపాడాలని ముస్లిం మహిళలు ఉన్నత న్యాయస్థానాన్ని కోరుతున్నారు.