- కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనన్నా వెనక్కు తగ్గని జగన్
- చంద్రబాబును పేరు పెట్టి టార్గెట్ చేసిన మోడీ.. జగన్ను తిట్టని వైనం
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
ఏ రాష్ట్రానికైనా.. కేంద్రంతో సత్సంబంధాలు అత్యంత కీలకం. రాజ్యాంగం ప్రకారం.. కేంద్ర-రాష్ట్ర ప్రభు త్వాలు.. దేశాభివృద్ధికి జోడెద్దులు! ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు-కేంద్రానికి మధ్య అవినాభావ సంబంధం కీలకం. ఈ విషయంలో సీనియర్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేశారు? ఐదేళ్ల ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ఎలా వ్యవహరించారు? అనేది కీలకం. ఈ విషయాన్ని చూస్తే.. ఇరువురి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇందులో ఎవరికోణం ఎలా ఉన్నా.. ప్రజా కోణంలో చూసుకుంటే.. జగన్ ముందున్నారనేది నిర్వివాదాంశం.
చంద్రబాబు:
+ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. బీజేపీతో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి రాష్ట్రంలో, తన పార్టీకి కేంద్రంలోనూ మంత్రి పదవులు కూడా దక్కాయి. అప్పుడే ఏర్పడిన ఏపీకి ఇవ్వాల్సిన విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో చంద్రబాబు విఫలయ్యారనేది సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించారు. కేంద్రంతో సత్సంబంధాలు పెంచుకున్నప్పటికీ.. దానిని రాష్ట్ర ప్రయోజనంగా మెరుగు పరచడంలో చంద్రబాబుది ఎప్పుడూ వెనుకడుగుగానే ఉంది.
+ ముఖ్యంగా ప్రజారాజధానికి నిధులు సమీకరించడంలోనూ.. వడివడిగా దానిని నిర్మించే విషయంలోనూ కేంద్రం సహకారాన్ని ఆయన అందిపుచ్చుకునేలా చేసుకోలేక పోయారు. ఫలితంగా రాజధాని విషయాన్ని కేంద్రం వదిలేసింది. వాస్తవానికి ఏపీ కొత్త రాజధానికి కేంద్రం సాయం చేయాలన్నది విభజన చట్టంలోని కీలక అంశం. ఈ విషయంలో చంద్రబాబు విఫలమయ్యారు.
+ ఇక, ప్రత్యేకహోదా విషయంలోనూ మిత్రుడిగా ఉండి సాధించలేక పోయారు. ముందు కేంద్రానికి తలూపిన చంద్రబాబు.. ఎన్నికలకు ముందు.. కావాలంటూ.. మడత పేచీ పెట్టారు. కేంద్రంతో కయ్యానికి దిగారు. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా కన్సంట్ చేశారు. మోడీపైనా.. కేంద్ర మంత్రులపైనా తీవ్ర విమర్శలు, నల్ల చొక్కాలతో నిరసనలు చేశారు. ఫలితంగా సున్నితమైన బంధం తెగిపోయింది. ప్రధాని ఏపీకి వచ్చి.. చంద్రబాబును అవినీతి పరుడంటూ విమర్శలు చేసే పరిస్థితి వచ్చింది. ఇది రాష్ట్రానికి, చంద్రబాబుకు కూడా సెగ పెట్టిందనేది కీలకం. ప్యాకేజీకి ఒప్పుకొన్నా.. ఆ నిధులు సక్రమంగా తెచ్చుకోలేక పోయారనే వాదన కూడా ఉంది.
జగన్:
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాకపోయినా.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వనన్నా.. జగన్ వెనక్కి తగ్గలేదు. ఇది అతిశయోక్తి.. భజన కాదు. వాస్తవం! ఇక, కేంద్రం నుంచి గ్రాంట్స్ రప్పించుకోవడంతో తొలి ఏడాది సక్సెస్ అయినా.. తర్వాత కేంద్రం గ్రాంట్స్ను తీసేసి.. అప్పులు ఇవ్వడం ప్రారంభించింది. దీనిలోనూ జగన్ సక్సెస్ అయ్యారు. ఇతర రాష్ట్రాలకు నిబంధనలు విధించినప్పుడు కూడా.. రూపాయి విడుదల చేయకుండా కేంద్రం ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా(తెలంగాణ, ఢిల్లీ వంటివి) ఏపీకి సమృద్ధిగా అప్పుల నిధులు అందాయి. ఇది కేంద్ర-రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధానికి నిదర్శనం.
+ విభజన చట్టంలోని అంశాలను సక్సెస్ చేసేందుకు జగన్ కృషి చేశారు. 22 సార్లు పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రానికి తాము మద్దతిస్తున్నా.. ఇలా చేయడం తగదని చెప్పారు. రాజమండ్రి(తూర్పు గోదావరి)లో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చినప్రధాని ముందే.. ఏపీకి హోదా ఇవ్వాలని సభా ముఖంగా కోరారు కానీ, అప్పటికే చంద్రబాబు హోదా అవసరం లేదన్న విధానాన్ని కేంద్రం స్పష్టం చేసింది.
+ ఇక, రాష్ట్రంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. కేంద్రం కొన్ని కొన్ని (పోలవరం-కడప ఉక్కు-విశాఖ స్టీల్ ప్లాంటు.. ప్రైవేటీకరణ వంటివి) విషయాల్లో ఒంటెత్తు పోకడలకు పోయినా.. జగన్ తొందర పడకుండా.. కేంద్రంలో తెగతెంపులు చేసుకోకుండా.. సంయమనం పాటించారు. ఫలితంగా ఆ బంధం అలానే నిలిచింది. మోడీ ఇప్పుడు ఏపీకి వచ్చినా.. జగన్ను పేరుపెట్టి(గతంలో చంద్రబాబును పేరుపెట్టినట్టు) విమర్శించే పరిస్థితి లేకపోవడానికి ఈ బంధమే కారణం. సో.. ఇలా చూసుకుంటే.. చంద్రబాబు కంటే.. జగన్ వంద రెట్లు బెటర్ అనేది రాజకీయ పండితులు చెబుతున్న మాట.