ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం దెబ్బకు విశాఖపట్నంలో టీడీపీకి కష్టాలు మొదలైన విషయం తెలిసిందే. చంద్రబాబు మూడు రాజధానులని వ్యతిరేకిస్తూ, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో విశాఖ టీడీపీ నేతలకు ఎటు మద్ధతు ఇవ్వాలో అర్ధం అవ్వక సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే కొందరు నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు.

మరికొందరు వెళ్లడానికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి వెళ్లడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. అటు సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, వెస్ట్ ఎమ్మెల్యే గణబాబులు కూడా చంద్రబాబు పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. కానీ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ  మాత్రం బాబుకు సపోర్ట్‌గానే ఉంటున్నారు. రామకృష్ణ విశాఖ ఈస్ట్ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున విజయం సాధించారు.

మొన్న ఎన్నికల్లో జగన్ వేవ్‌లో కూడా భారీ మెజారిటీతో గెలిచారు. నియోజకవర్గంలో యాక్టివ్‌గానే పనిచేసుకుంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కరించడంలో ముందున్నారు. వైసీపీ ప్రభుత్వంపై బాగానే పోరాటం చేస్తున్నారు. రాజధాని విషయంలో అమరావతికే మద్ధతు తెలిపారు. కానీ వైసీపీ శ్రేణులు ఈయన్ని టార్గెట్ చేయడంతో, ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు. అయినా సరే వెలగపూడి మాత్రం రాజధాని దెబ్బకు తలోగ్గే పరిస్తితి లేదని తెలుస్తోంది.

ఒకవేళ విశాఖలో మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడిన వెలగపూడి మాత్రం చంద్రబాబుతోనే ఉండటం ఖాయం. పైగా విశాఖ ఈస్ట్ టీడీపీకి కంచుకోటగా ఉంది కాబట్టి, ఇక్కడ వైసీపీకి పెద్దగా బలం పుంజుకునే అవకాశాలు రావడం లేదు. కాకపోతే విశాఖ రాజధాని కావడం వల్ల ఏమన్నా కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అయితే స్థానికంగా ఉన్న సమస్యలని పరిష్కరిస్తేనే వైసీపీ, టీడీపీని డామినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు రాజధాని రావడాన్ని స్వాగతిస్తున్నా కూడా తమ సమస్యలని పరిష్కరించే నేతలకే మద్ధతు ఇస్తారు. అలా వెలగపూడి పనిచేస్తారు కాబట్టి, మూడుసార్లు ఆయన్ని గెలిపించారు. ఏదేమైనా విశాఖలో టీడీపీ తరుపున వెలగపూడి గట్టిగానే నిలబడుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: