నందమూరి సింహం బాలకృష్ణకు ఆవేశం వచ్చినా అనుగ్రహం వచ్చినా ఈరెండు విషయాలలో ఎటువంటి నియంత్రణ ఉండదు. అలాంటి సందర్భమే మరొకసారి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. తెలంగాణా రాష్ట్రంలో వచ్చే నవంబర్ లో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి నిన్న ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలలో పర్యటించాడు.
అయితే ఈ పర్యటనలో బాలయ్య తీరువల్ల అభిమానులకు తీవ్ర అసహనం కలగడమే కాకుండా తమ అభిమాన హీరో తమను కాలితో తన్నారని ఆరోపిస్తూ బాలయ్య అభిమానులు బాలకృష్ణ ఫ్లేక్సీలను తగల పెట్టిన సంఘటనకు సంబంధించిన ఒక సంచలన వార్తను ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక ప్రముఖంగా ప్రకటించింది. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే బాలయ్య ఖమ్మం జిల్లా తల్లాడ నుండి మిట్టపల్లి వెళ్ళడం జరిగింది.
అక్కడ బాలయ్య అభిమానులు అనేకమంది అతడి కాన్వాయ్ కు అడ్డు తగలడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాలకృష్ణ తన వ్యాన్ నుండి దిగి ఆవేశంతో రగిలిపోయి అడ్డు తగిలిన వ్యక్తులు తన అభిమానులు అవునా కాదా అన్న విషయం తెలియకుండానే వారిని కాలితో తన్నినట్లు ఆపత్రిక కథనం ప్రచురించింది. అయితే తాము తమ అభిమాన హీరో బాలయ్యను చూడటానికి వస్తే తమను ఇలా అవమానించడం ఏమిటి అంటూ అభిమానులు బాలకృష్ణ తీరు పై నిరసన వ్యక్త పరుస్తూ అతడి ఫ్లెక్సీలను తెలుగుదేశం జెండాలను తగలపెట్టినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి గతంలో కూడ బాలకృష్ణ అనేక సార్లు తన అభిమానుల పై ఇలా దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాలకృష్ణ తనకు తాను సమర్ధించుకుంటూ తన అభిమానుల పై తనకు సర్వహక్కులు ఉన్నాయని తాను వారికి అన్నయ్యను అంటూ సద్ది చెప్పుకున్నాడు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న ఈసమయంలో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించిన ఈసంఘటనను ఎలా సమర్ధించుకుంటాడో చూడాలి..