2024 ఏపీ ఎన్నికల్లో కడప పార్లమెంట్, కడప అసెంబ్లీ స్థానాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. కడప ఎంపీ స్థానం నుంచి కానీ కడప ఎమ్మెల్యే స్థానం నుంచి కానీ ఇప్పటివరకు మహిళా అభ్యర్థి విజేతగా నిలిచిన చరిత్ర లేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కడప అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మాధవీ రెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న షర్మిల వైసీపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు.
 
షర్మిల, మాధవి ఈ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్రను తిరగరాస్తారేమో చూడాల్సి ఉంది. కడప అసెంబ్లీ నియోజకవర్గానికి మాధవీరెడ్డిని టీడీపీ ఇంఛార్జీగా ప్రకటించిన రోజు నుంచి గెలుపు కోసం ఆమె పడిన కష్టం అంతాఇంతా కాదు. తెలివిగా అడుగులు వేస్తూ తనదైన వ్యూహాలతో ముందుకెళ్తూ మాధవీరెడ్డి కడప ఓటర్లను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. వైసీపీ అభ్యర్థి అంజాద్  బాషాకు ఆమె గట్టి పోటీ ఇవ్వడం గ్యారంటీ అని చెప్పవచ్చు.
 
కడప జిల్లాలో మైనార్టీల ఓట్లు కీలకం కావడం, టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మాధవీరెడ్డికి మైనస్ లు అని చెప్పవచ్చు. కడప వైసీపీకి కంచుకోట కావడం వల్ల ఇక్కడినుంచి మాధవి ఎమ్మెల్యేగా విజయం సాధించడం సులువు కాదు. అయితే పట్టు వదలకుండా ఆమె గెలుపు కోసం కష్టపడటాన్ని మాత్రం ఎంత ప్రశంసించినా తక్కువేనని చెప్పవచ్చు.
 
మరోవైపు నిత్యం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న షర్మిల కడప ఎంపీగా తాను విజయం సాధించడం కంటే అవినాష్ రెడ్డిని ఓడించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. గత 35 సంవత్సరాలుగా కడప పార్లమెంట్ లో వైఎస్ కుటుంబ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. అయితే వైఎస్ కుటుంబానికి చెందిన షర్మిల, అవినాష్ రెడ్డి ఈ ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
 
షర్మిల వైసీపీ కడప ఎంపీ టికెట్ కోరితే జగన్ నిరాకరించారని షర్మిల, జగన్ మధ్య విభేదాలకు కారణం ఇదేనని కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. షర్మిలకు కడప ఎంపీ అభ్యర్థిగా డిపాజిట్లు కూడా దక్కవని వైసీపీ భావిస్తుండగా కడప ఎంపీగా గెలిచి చూపిస్తానని షర్మిల చెబుతున్నారు. మహిళా అభ్యర్థులే గెలవని ఈ నియోజకవర్గాల్లో మాధవీరెడ్డి లేదా షర్మిల గెలిస్తే వాళ్ల ఖాతాలో సరికొత్త రికార్డులు చేరతాయి.
 
ఉమ్మడి కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున దాసరి సుధ పోటీ చేస్తుండగా ఆమె ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి బొజ్జా రోషన్న పోటీ చేస్తున్నారు. బద్వేల్ నియోజకవర్గంలో దాసరి సుధకు గెలుపు నల్లేరుపై నడక అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: