నటుడు, టీడీపీ నేత హరికృష్ణ హఠాన్మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. నందమూరి హరికృష్ణ మరణ వార్తతో ఆయన కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు శోక సంద్రంలో మునిగారు. కష్టమైనా, సుఖమైనా తమ వెంటే ఉంటూ.. వెన్నుతట్టి ప్రోత్సహించిన తమ తండ్రి ఇకలేరనే విషయాన్ని తెలుసుకుని కుమిలిపోతున్నారు.
‘సీతయ్య.. ఎవరి మాట వినడు’.. ఈ డైలాగ్ వినగానే మనకు గుర్తుకు వచ్చేది హరికృష్ణే. మొండిగా ఉండే వ్యక్తులను ‘సీతయ్య’ పాత్రతో పోల్చేంతగా ఈ డైలాగ్ పాపులర్ అయ్యింది. 51 ఏళ్ల సినీ జీవితంలో ఆయన 13 చిత్రాల్లోనే నటించారు. నందమూరి హరికృష్ణ ఈ రోజు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై నటి సిమ్రాన్ స్పందించారు. హరికృష్ణ ఇకలేరన్న వార్త తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు సిమ్రాన్ వెల్లడించారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.‘నందమూరి హరికృష్ణ ఇక లేరన్న వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని సిమ్రాన్ ఈ రోజు ట్వీట్ చేశారు.